హైదరాబాద్ : నగరంలోని నిజాం కళాశాల బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. కళాశాలలో రూ.8.50కోట్లతో హాస్టల్ను నిర్మించారు. ఈ సందర్భంగా కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలను ప్రదానం చేశారు. కళాశాల పూర్వ విద్యార్థిగా జ్ఞాపకాలను కేటీఆర్ నెమరువేసుకున్నారు. గతంలో ప్రిన్సిపాల్కు ఇచ్చిన హామీ మేరకు బాలికల హాస్టల్ వసతి గృహాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కాలేజీ అభివృద్ధికి రూ.15కోట్లు అడిగారని, అది కూడా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
నేటి యువత కెరీర్పరంగా, భవిష్యత్పై ఓ స్పష్టమైన అవగాహన కలిగి.. ఆ దిశలోనే విద్యార్థి స్థాయి నుంచి కృషి చేస్తున్నారన్నారు. ఏడున్నరేళ్లుగా చాలా మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, కళాశాల విద్యార్థులు గ్రాడ్యుయేట్ అవుతున్న రోజే 80వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అవుతుందని, మీరంతా అదృష్టవంతులన్నారు. తాను గ్రాడ్యుయేషన్లో ఉన్న సమయంలో తనకు ఏం చేయాలి.. ఏం కావాలని స్పష్టత లేదని, కానీ.. 8వ తరగతి చదువుతున్న తన కూతురు, ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న తన కొడుకుకు వాళ్ల జీవితంలో ఏం కావాలి.. ఏం చేయాలనే స్పష్టత ఉందన్నారు.
ఈ జనరేషన్ పిల్లలకు వారి జీవితంపై మంచి స్పష్టత ఉందని, అందుకు తగ్గట్టుగానే వారు కోర్సులు ఉంచుకొని.. కలలను సాకారం చేసుకుంటున్నారన్నారు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఫలానా పని మీకు చేతకాదు.. మీ వల్ల కాదు.. మీకు సాధ్యం కాదని చెబితే వాళ్ల మాటలు నమ్మొద్దని, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలని, మీరు తలచుకుంటే చేయలేనిది ఏం ఉండదని తెలుసుకోండి అని మంత్రి విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.