రూ. 1.34 కోట్లతో నిర్మాణం
ఈ మధ్యే ప్రారంభించిన కేటీఆర్
రాష్ట్రంలోనే తొలిసారి ఏర్పాటు
అన్ని పనులు యంత్రాలతోనే
త్వరలో అందుబాటులోకి మరొకటి
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 4: రజకుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ఆధునిక సౌకర్యాలతో మోడ్రన్ ధోబీఘాట్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్నది. ఏడాది వ్యవధిలోనే సిరిసిల్లలో రూ.1.34 కోట్లతో నిర్మించిన రాష్ట్రంలోనే తొలి మోడ్రన్ ధోబీఘాట్ను ఈ నెల 3న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రజక వృత్తిపై యువత మక్కువ చూపకపోవటంతో ప్రభుత్వం ఈ వృత్తికి మోడ్రన్ సొబగులు తీసుకొచ్చింది. పట్టణంలోని రజకులకు అందుబాటులో ఉండేలా స్థానికంగా రెండు చోట్ల ధోబీఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటి కోసం మంత్రి కేటీఆర్ రూ.2.68 కోట్లు మంజూరు చేయగా, స్థానిక 36వ వార్డులో ఒకటి నిర్మించారు. త్వరలోనే మరో ధోబీఘాట్ను నిర్మించనున్నారు. మోడ్రన్ ధోబీ ఘాట్ నిర్వహణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో చైర్మన్, వైస్చైర్మన్తో పాటు డైరెక్టర్లు, ఉంటారు. 20 మంది యువతకు ఉపాధి కల్పిస్తారు. స్థానిక రజకులు తెచ్చిన దుస్తులను ఉతికి, ఇస్త్రీ చేసి అందజేస్తారు. ఇందుకు నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. దీని ద్వారా రజకులకు పనిభారం తగ్గడంతో పాటు యువతకు ఉపాధి లభించనున్నది.
రాష్ట్రమంతా విస్తరిస్తాం: మంత్రి కేటీఆర్
మోడ్రన్ ధోబీఘాట్పై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘సిరిసిల్లలో అత్యాధునిక యాంత్రీకృత ధోబీఘాట్ను నిర్మించినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, అధికారులకు అభినందనలు. వీటిని రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు విస్తరిస్తాం’ అని ట్వీట్ చేశారు.