నేడు ప్రారంభించనున్న ఐటీ మంత్రి కేటీఆర్
2 వేలమందికి శిక్షణ, భోజనం
మేడ్చల్ జిల్లాలో మరిన్ని శిక్షణ కేంద్రాలు
కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి వెల్లడి
మేడ్చల్, మార్చి 13 : నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చేందుకు మేడ్చల్ జిల్లాలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నామని కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తెలిపారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని బుద్ధనగర్ సాయిబాబా టెంపుల్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం ప్రారంభిస్తారని చెప్పారు. ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్- 2, గ్రూప్- 3, గ్రూప్-4 తదితర ఉద్యోగాల కోసం రెండువేల మందికి మూడు నుంచి నాలుగు నెలలపాటు ఇక్కడ శిక్షణ ఇస్తారని వెల్లడించారు. పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వటంలో 20 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న అధ్యాపకులు బోధిస్తారని, స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా అందిస్తామని ఆదివారం తెలిపారు. అభ్యర్థులందరికీ మధ్యాహ్న భోజన వసతితోపాటు సాయంత్రం స్నాక్స్ అందిస్తారని చెప్పారు. కోచింగ్ సెంటర్ ఏర్పాట్లను పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి పర్యవేక్షించారు. మేడ్చల్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఉద్యోగార్థులంతా ఉచిత కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.