Dalit Bandhu | ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 27: ఏండ్లుగా చీకట్లో మగ్గుతూ, అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకం వారి తలరాతను మార్చుతున్నది. వారికి బతుకుబాట చూపుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో తొమ్మిది మంది ఏకమై తీసుకున్న నిర్ణయం దళిత జాతికే ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలోని తొమ్మిదిమంది కలిసి పెట్రోల్ బంకు ఏర్పాటు చేసుకోవడం, బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రారంభించి అందుబాటులోకి తేగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
తొమ్మిది కుటుంబాల్లో వెలుగులు..
దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ దళితబంధుకు శ్రీకారం చుట్టింది. తొలుత రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వంద మందికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ క్రమంలో అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ ఆదేశాలతో కలెక్టర్ ఈ పథకం అమలుకు చర్యలు చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. పదిరలోని దళితకాలనీలో సర్వే చేసి, 23 కుటుంబాలను లబ్ధిదారులుగా గుర్తించారు. గతేడాది జనవరిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలోచన మేరకు ట్రాక్టర్లు, వాహనాలు కాకుండా ఇతర శాశ్వత లబ్ధిని పొందే యూనిట్లను తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దీంతో కలెక్టర్ అనురాగ్ జయంతి పలు శాఖల అధికారులతో లబ్ధిదారుల కుటుంబాలకు గతేడాది జనవరి 25న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో భాగంగా తొమ్మిదిమంది లబ్ధిదారులు తెడ్డు పద్మ (బీడీ కార్మికురాలు), తెడ్డు ఎల్లవ్వ (వ్యవసాయ కూలీ), తెడ్డు దేవేంద్ర (బీడీ కార్మికురాలు), తెడ్డు ప్రమీల (దినసరి కూలీ), తెడ్డు లక్ష్మి (దినసరి కూలీ), తెడ్డు బాల్లక్ష్మి (బీడీ కార్మికురాలు), రుద్రారపు సతీశ్ (ట్రాక్టర్ డ్రైవర్), జెడల ఎల్లవ్వ (దినసరి కూలీ), పత్రి రాజవ్వ (దినసరి కూలీ) కలిసి పెట్రోలు బంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, చొరవతీసుకుని నయారా బంకు ఏర్పాటుకు సదరు కంపనీ ప్రతినిధులతో మాట్లాడారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రూ.90 లక్షలు మంజూరయ్యాయి. ఎస్బీఐ, ఇతర వనరుల ద్వారా మరో రూ.80 లక్షలు రుణం తీసుకున్నారు. మొత్తం రూ.1.70 కోట్లు సమకూర్చుకున్నారు. బంకు కోసం కామారెడ్డి-కరీంనగర్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న 20 గుంటల స్థలాన్ని నెలకు రూ.17,500కు లీజుకు తీసుకొని పెట్రోలు బంకు ఏర్పాటు చేసుకున్నారు. అక్టోబర్ చివరి వారంలో పనులు పూర్తయినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా బంకు ప్రారంభం వాయిదా పడింది. కాగా, ఈ పెట్రోలు బంకును బుధవారం కేటీఆర్ ప్రారంభించారు.
ఏండ్లసంది జీతగాడిని.. ఇప్పుడు ఓనరైన
నేను 15 ఏండ్ల సం ది ఊళ్లే ట్రాక్టర్ డ్రైవర్గా జీతం ఉండి బతికిన. కేసీఆర్ సారు జెయ్యవ ట్టి నాకు దళితబంధు వ చ్చింది. మా ఊరోళ్లం తొమ్మిది మంది కలిసి పెట్రోలు పంపు పె ట్టుకున్నం. మొన్నటిదాకా జీతానికి పనిచేసిన నేను ఇప్పుడు బంకుకు ఓనరైన. కేసీఆర్ సార్ రుణం ఎప్పటికీ మర్చిపోలేను.
-రుద్రారపు సతీశ్,దళితబంధు లబ్ధిదారు, పదిర
ఇగ కొడుకు దుబాయ్ పోడు..
ఉన్న ఊళ్లే బతుకుదెరువు లేక కొడుకులు దేశాలు పట్టుక తిరిగే పరిస్థితి మాది. పోయిన ఏడాది కేసీఆర్ సార్ దళితబంధు కింద రూ.10 లక్షలు ఇస్తరట అని అందరు సెప్పితె నమ్మలే. మాకు మా ఊర్లె అందరికీ దళితబందు పైసలు ఇచ్చిర్రు. ఇగ మా మల్లారెడ్డి సారు (సెస్ మాజీ డైరెక్టర్) తొమ్మిది మంది గలిసి పెట్రోలు బంకు పెట్టుకోర్రి మంచిగుంటదని చెప్పిండు. పెట్రోలు బంకు పెట్టినంక ఇక్కన్నే బంకుల పనిజేసుకుంట ఉన్నడు. ఇగ కొడుకు దుబాయ్కి పోడు. మాకు సాయం జేసిన కేటీఆర్ సారును మరిచిపోము.
– తెడ్డు ప్రమీల, దళితబంధు లబ్ధిదారు, పదిర