హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంచేస్తున్నట్టు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థ సంయుక్తంగా నాగోల్లోని ఫతుల్లాగూడలో ఏర్పాటుచేసిన భవననిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను శుక్రవారం కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ మాదిరిగా వరంగల్, ఇతర పట్టణాల్లో క్లస్టర్ల తరహాలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. వ్యర్థాల తరలింపునకు టోల్ ఫ్రీనంబర్ 18001201159 అందుబాటులోకి తెచ్చామన్నారు. వ్యర్థాల తరలింపు, రీసైక్లింగ్ కోసం త్వరలో ‘మై జీహెచ్ఎంసీ యాప్’ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్ తర్వాత హైదరాబాద్లోనే సీఅండ్డీ (కన్స్ట్రక్షన్ అండ్ డిమోలిషన్) ప్లాంట్లు ఉన్నాయని చెప్పారు.