KTR | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణ సమాజం చిన్నాభిన్నమై దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను తొలి ప్రాధాన్యతగా ఎంచుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యల వల్ల రాష్ట్రంలో పేదరికం 16.12% తగ్గిందని, తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో 21.92 శాతంగా ఉన్న పేదరికం.. ప్రస్తుతం 5.8 శాతానికి దిగివచ్చిందని పేర్కొన్నారు. సంక్షేమంలో స్వర్ణయుగాన్ని తీసుకొచ్చామని, చివరికి కొవిడ్ సంక్షోభ సమయంలోనూ సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదని గుర్తుచేశారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, కార్మికులు సహా సబ్బండ వర్గాల కోసం మానవీయకోణంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం రూ.2,86,230 కోట్లు వెచ్చించిందని గుర్తుచేశారు. విద్యా, వైద్యంతోపాటు సామాజిక భద్రత పథకాలతో భరోసా కల్పించిందని తెలిపారు.
ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మీ, దళితబంధు, ఎస్సీ సబ్ప్లాన్, అంబేద్కర్ భవనాలు, 125 అడుగుల విగ్రహం ఏర్పాటు, టీఎస్ ప్రైడ్, 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పంపిణీ కార్యక్రమాలను అమలు చేసిందని చెప్పారు. గిరిజనులకు తండాలు, గూడేల్లో స్వయం పాలన కల్పించిందని, 4 లక్షల ఎకరాల అడవి భూములపై హక్కులు కల్పించిందని, పోడు భూములకు పట్టాలిచ్చి రైతుబంధు మంజూరు చేసిందని, ఆదివాసీ, బంజార భవనాలు, జోడెఘాట్లో కుమ్రంభీం గోండు మ్యూజియం తదితర నిర్మాణాలు చేపట్టిందని వివరించారు. 204 గురుకులాలతో మైనార్టీల్లో విద్యా విప్లవం తీసుకొచ్చామని, పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ పథకాలను అమలు చేయడంతోపాటు ఇమాం, మౌజంలకు రూ.10వేల గౌరవ వేతనం చెల్లించామని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యధిక జీతాలు ఇచ్చామని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 30% పీఆర్సీ వర్తింపజేశామని, 1.7 లక్షల మంది సఫాయి కార్మికులు, జీహెచ్ఎంసీ కార్మికులు, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, 54 వేల మంది హోంగార్డుల వేతనాలు పెంచామని, వీఏవోలకు పేస్కేలు ఇచ్చామని, వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.60 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని, ఐటీ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు, ఇతర ప్రైవేట్ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. ‘మా దృష్టిలో ఆస్తులంటే నిర్మాణాలే కాదు. ప్రజల్లో పెరిగిన జీవన ప్రమాణాలు. దేశానికే తలమానికంగా పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట. ప్రతి కుటుంబంలో పెరిగిన ఆత్మవిశ్వాసం. స్వల్పకాలంలోనే మేము సాధించిన రాష్ట్ర సమగ్రాభివృద్ధే తెలంగాణకు అసలైన గొప్ప ఆస్తి’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ అమూల్యమైన ఆస్తులను ఎలా కొలుస్తారని ప్రశ్నించారు.
సబ్బండ వర్ణాల సంక్షేమానికి వెచ్చించిన నిధులు వర్గం/పథకం ఖర్చు (రూ.కోట్లలో)