BRS | రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 22వ తేదీన అన్ని మండల కేంద్రాలు/నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ తరఫున ధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతన్నలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవడంతో ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయ్యిందని చెబుతుంటే.. మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తికాలేదని.. కార్యక్రమం కొనసాగుతుందని చెబుతున్నారని అన్నారు. ఎవరికీ తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతన్నలను అయోమయానికి, ఆవేదనకు గురిచేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు రెండు లక్షల వరకు రుణమాఫీని అందరికీ వర్తింపజేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఎన్నికలు కాగానే రైతు రుణమాఫీ కోసం రూ. 40 వేల కోట్ల రూపాయలు అవసరమని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని.. కానీ కేబినెట్ మాత్రం కేవలం 31 వేల కోట్లకు మాత్రమే అనుమతిచ్చిందని అన్నారు. ఇక బడ్జెట్లో 26 వేల కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపి రైతులను మోసం చేశారని తెలిపారు. బడ్జెట్లో కేటాయించిన రూ. 26 వేల కోట్లలో నుంచి కేవలం 18 వేల కోట్ల రూపాయలే ఖర్చు చేసి రైతులను నిలువునా ముంచినట్లు తీవ్రంగా మండిపడ్డారు.
రైతు రుణమాఫీ జరగక ఆందోళన చేస్తున్న రైతులకు అండగా ఉండాల్సింది పోయి.. మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను మరింత గందరగోళానికి గురిచేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం 40% మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి చేకూరలేదని, క్షేత్రస్థాయి నుంచి తమకు సమాచారం అందిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి కారణంగా లక్షలాది మంది రైతన్నలు రోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని వెంటనే చేయాలని, ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 9లోగా రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఆగస్టు 15 అంటూ మరోసారి మాట తప్పారని మండిపడ్డారు. అడ్డగోలు ఆంక్షలు పెట్టి రైతులకు రుణమాఫీ అందకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. లక్షలాది మంది రైతన్నలకు అండగా ఉండేందుకు ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చేందుకే ఈనెల 22వ తేదీన అన్ని మండల కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతన్నలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అందే వరకు భారత రాష్ట్ర సమితి తరఫున ప్రభుత్వంపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు.