Minister KTR | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పేపర్ లీకేజీ వ్యవహారంపై తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లీకేజీ వ్యవహారంపై తనపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై లెక్కలతో సహా వివరిస్తూ.. ఆయా పార్టీల తీరును తూర్పారాబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రేవంత్రెడ్డి అని ఓ వ్యక్తి ఉన్నడు. నోటికి ఎంత వస్తే అంత ఆరోపణలు చేస్తడు. నా వెంట తిరుపతి అని పీఏ ఉన్నడు. నా దగ్గర పది పదిహేనేళ్లుగా పని చేస్తున్నడు.
ఇప్పుడు అతని వెంట పడ్డాడు. గూడుపుఠాణి చేసి వాళ్ల ఊరిలో మొత్తం పేపర్ ఇచ్చిండు.. పెద్ద కుంభకోణం కేటీఆర్ పేషి నుంచి నడిచింది. మొత్తం ఒకటే మండలం వంద మందికి 100 మార్కులకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని పనికిమాలిన వాగుడు వాగిండు. ఈ లెక్కలు మీ ముందు పెడుతున్నా. కారుకూతలు కూసిన సన్నాసులు రేవంత్రెడ్డి, బండి సంజయ్ కూడా ఈ లెక్కలు వినాలి. మల్యాల మండలంలో 417 మంది అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో క్వాలిఫై అయ్యింది 35 మంది మాత్రమే. వాళ్లు 100 మందికి వందకుపైగా మార్కులు వచ్చాయంటున్నారు. మొత్తం జగిత్యాల జిల్లాలో 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చింది ఒకే ఒక అభ్యర్థికి’ అని తెలిపారు.
‘పనికిమాలిన మాటలు రేవంత్రెడ్డి.. ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటవ్. నేను చెప్పేది వాస్తవం కాదని రుజువు చేసే దమ్ముందా? తిరుపతి సొంత ఊరు పోతారం. ఆ ఊరిలో పేపర్లను చాకెట్లు పంచినట్లు పంచిండని, అమ్ముకున్నడని ఆరోపిస్తున్నరు. పోతారం గ్రామంలో గ్రూప్-1 పరీక్షకు హాజరైంది ముగ్గురు. ఇందులో ఎవరూ క్వాలిఫై కాలేదు. ఇంకా గమ్మతి ముచ్చట చెబుతా. మల్యాల మండల కేంద్రంలో ముగ్గురు అభ్యర్థులు హాజరైతే.. ఒకరే క్వాలిఫై అయ్యిండు. ఒకవేళ నేను పేపర్ లీక్ చేసినా ఇక్కడే ఇస్తాను కదా? రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4205 మంది దరఖాస్తు చేయగా.. 3,254 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 250 మంది 23-90 మధ్య మార్కులు వచ్చాయి. ఎవరికీ వంద మార్కులు దాటలేదు. నేను పేపర్ లీక్ చేస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో, మల్యాలలో వంద మార్కులు దాటకపాయే. మరి నేను పేపర్ లీక్ చేసింది ఎక్కడ? పోయింది ఎక్కడ? ఇంతకంటే అన్యాయం ఉంటదా? నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా’నన్నారు.
‘ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో పోయిన ఎనిమిదేళ్లలో 13 పేపర్లు లీకయ్యాయి. అక్కడ ఎవరైనా మంత్రి రాజీనామా చేశారా? ముఖ్యమంత్రి రాజీనామా చేశాడా? అధికారినైనా తొలగించారా? మరి ఇక్కడ ఎలా మాట్లాడుతారు? ఇక్కడ మంత్రి రాజీనామా చేయాలి? ఒక్కో పిలగానికి రూ.లక్ష ఇవ్వాలని బండి సంజయ్ అంటున్నడు. ‘మనది కాకపోతే కాశీదాకా దేకచ్చు’ అంటరు కదా? మరి గుజరాత్లో రూ.50వేలు, రూ.10వేలు ఇచ్చినవా? ఇజ్జత్ మానం ఏమైనా ఉన్నదా? ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా డబ్బులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? నిన్నగాక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చొప్పదండికి వచ్చారు.
పంటనష్టం జరిగితే వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలు తిరిగి కరీంనగర్కు వస్తే.. పంట నష్టపోయిన రైతులకు రూ.10వేలు ఎకరానికి చొప్పున హెక్టార్కు రూ.25వేలు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం ఇవ్వనంత సీఎం కేసీఆర్ పరిహారం ప్రకటించి వెళ్లారు. దీనిపై బండి సంజయ్ ఏ మూలకు సరిపోదు అంటున్నడు. మరి అంత మోగోనివైతే నువ్వు కూడా నీ మోదీతోని మాట్లాడి.. ఆయన వద్దకుపోయి మా ముఖ్యమంత్రి రూ.10వేలు ఇచ్చిండు. ఇది సరిపోతలేదు. ఒక్కో రైతుకు కేంద్రం నుంచి రూ.లక్ష ఇస్తున్నామని చెప్పు ఎవరైనా వద్దంటున్నరా? అడ్డపండుతున్నమా? ఇవ్వడానికి తెలివిలేదు. ఇచ్చటోడిని ఎకచెక్కపు, చిల్లరమాటలు మాట్లాడుతున్నడు. దేశంలో ఎక్కడైనా బీజేపీ ప్రభుత్వం హెక్టార్కు రూ.25వేల ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం ఉందని చూపిస్తావా? నోటికి ఎంత వస్తే అంత ఒర్రుడు.. పిచ్చికుక్కల్లా మొరగడం తప్పా ఏ పని చేతకాదు’ కాదు అంటూ విమర్శించారు.