హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): స్టేట్ స్ట్రీట్ కంపెనీ హైదరాబాద్లో నెలకొల్పిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నదని, ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని ఆకర్షిస్తున్నదని రాష్ట్ర ఐటీ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కేపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటుచేయాలని 2017లో ఆ సంస్థ తీసుకున్న నిర్ణయం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. మంత్రి కేటీఆర్ స్టేట్ స్ట్రీట్ కంపెనీ ప్రతినిధులతో బుధవారం టీహబ్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలపై వారితో చర్చించారు. ఈ సమావేశంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బ్రయన్ ఫ్రాంజ్, భారత్లో సంస్థ అధిపతి రమేశ్ కాజా పాల్గొన్నారు. సంస్థాగత పెట్టుబడిదారులకు ఆర్థిక సేవలను అందించే స్టేట్ స్ట్రీట్ కార్పొరేషన్ నవంబర్ 2017లో హైదరాబాద్లో కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించింది. బెంగుళూరు, ముంబైలో కూడా సంస్థకు కార్యాలయాలు ఉన్నాయి. దేశంలోని స్టేట్ స్ట్రీట్ కార్యాలయాలు సాంకేతికత, కార్పొరేట్ ఫైనాన్స్, ఫండ్ అకౌంటింగ్, లావాదేవీ సేవలు, రిపోర్టింగ్ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.