ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, ఏప్రిల్12: పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకీ సృష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని, బీఆర్ఎస్ ఎంపీలను ఎక్కువ మందిని గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం బొంగుళూరు సమీపంలోని ప్రమిద గార్డెన్లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం పంచభక్ష పరమాన్నా లు కలిపిపెట్టినా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తినలేని పరిస్థితిలో ఉన్నది. హైదరాబాద్ చు ట్టూ ప్రతిష్ఠాత్మకమైన పరిశ్రమలను ఏర్పాటు చేయటానికి మేం అన్నీ సిద్ధం చేసినా రేవంత్ సర్కారు చేతకానితనం వల్ల అవన్నీ వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చింది’ అని తెలిపారు.
ప్రము ఖ ఫాక్స్కాన్ కంపెనీకి భూమి సేకరించి అందించామని, రైతులను ఒప్పించి వేల ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించామ ని వెల్లడించారు. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల అవి ప్రశ్నార్థకంలో పడ్డాయని దుయ్యబట్టారు. పరిశ్రమలను పెద్దమొత్తంలో ఏర్పాటు చేస్తే, అంతే మొత్తంలో రియల్ ఎస్టేట్ వ్యాపా రం పుంజుకుంటుందని వివరించారు. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీలు రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4 వేల పింఛను, రూ.500 బోనస్తో ధాన్యం కొనుగోళ్లు అమలు చేశాకే ఓట్లు అడగాలని సీఎం రేవంత్కు సవాల్ విసిరారు. సర్కారు చేతగానితనం వల్ల కరెంటు కోతలు ఏర్పడ్డాయని, వేల ఎకరాల పంటలు ఎండిపోయాయని వెల్లడించారు.
మిషన్ భగీరథ పథకాన్ని సరిగా అమలు చేయకపోవటంతో రాష్ట్రంతో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఏర్పడిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ సర్కారు ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి మంగళం పాడుతుందని ఆరోపించారు. ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీలపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాముడి పేరుతో ఓట్లు అడుగుతున్న బీజేపీ.. పదేండ్ల పాలనలో ధరలను విపరీతంగా పెంచి పేదల నడ్డి విరిచిందని ఆరోపించారు. తాము యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించినా, దాన్ని అడ్డం పెట్టుకొని ఏనాడూ ఓట్లు అడగలేదని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశ్, భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, జిల్లా రైతు సమన్వయసమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ జంగమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.