KTR | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలు ఉంటే ఎలాంటి విచారణైనా చేపట్టవచ్చునని, అందుకు తాము సిద్ధమేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఉద్ఘాటించారు. రాజకీయ స్వప్రయోజనాలకు ప్రాజెక్టులను బద్నాం చేయొద్దని, ప్రాజెక్టులపై బురదచల్లొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరిస్తూ రూపొందించిన స్వేదపత్రం విడుదల సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి ప్రాజెక్టులు పూర్తికాక, సాగునీళ్లు లేక వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని గుర్తుచేశారు. ఒక్క మహబూబ్నగర్ జిల్లా నుంచే 14 లక్షల మంది వలస పోయారంటే అనాటి పరిస్థితులను అర్దం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత నిర్దేశించుకున్న ప్రాధాన్య రంగాల్లో సాగునీటిరంగాన్ని కూడా ఒకటిగా ఎంచుకున్నామని వెల్లడించారు.
తొలుత మిషన్కాకతీయ చేపట్టి చెరువులను పునరుద్ధరించామని, వాగులపై చెక్డ్యామ్లను నిర్మించామని తెలిపారు. గత పదేండ్లలో గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో రూ.1.76 లక్షల కోట్లు వెచ్చించామని వివరించారు. పాలమూరులోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్, బీమా తదితర పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగున్నరేండ్లలోనే పూర్తి చేశామని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, సీతారామ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన ప్రధాన పనులన్నీ పూర్తి చేశామని వెల్లడించారు. సాగునీటి రంగంలో తాము చేపట్టిన చర్యల ఫలితంగా 50 లక్షల ఎకరాలను స్థిరీకరించామని, మరో 30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే విధంగా చాలావరకు పనులు పూర్తి చేశామని చెప్పారు. కాలువలు తవ్వి ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
అభినందించకున్నా ఫర్వాలేదు..నిందించకండి
ఇప్పటికే చనాక-కొరాట, కాళేశ్వరం ప్యాకేజీ-9, ప్యాకేజీ-22 పనులు పూర్తయ్యాయని కేటీఆర్ తెలిపారు. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించి తమ ఖాతాలో వేసుకోవచ్చని అన్నారు. బీఆర్ఎస్ సాధించిన ప్రగతిని, చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అభినందించుకున్నా ఫర్వాలేదని పేర్కొన్నారు. అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క బరాజ్లో వాటిల్లిన చిన్న సాంకేతిక లోపాన్ని భూతద్దంలో చూపి ప్రాజెక్టును బద్నాం చేయొద్దని కోరారు.
స్వేదపత్రంలోని ముఖ్యాంశాలు