హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. సెర్బి యా రిపబ్లిక్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఆధ్వర్యంలో వచ్చే నెల 20న సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగే బయోటెక్ ఫ్యూచర్ ఫోరంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.
హైదరాబాద్ను హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ హబ్ ఆఫ్ ఇండియాగా మార్చడంలో కీలకంగా వ్యవహరించిన అనుభవాలు, ఆలోచనలను సమావేశంలో పంచుకోవాల్సిందిగా సెర్బియా ప్రధానమంత్రి అనా బర్నాబిక్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గె బ్రిండే ఆహ్వానంలో కోరారు. ఈ సందర్భంగా తనకు ఆహ్వానం పంపి న సెర్బియా ప్రధానమంత్రి, డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆహ్వానం తెలంగాణ బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగానికి దక్కిన గుర్తింపుగా తాను భావిస్తానని పేర్కొన్నారు.