హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా విజయోత్సవాలను నిర్వహించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సెటైర్లు వేశారు. ఎనుముల వారి ఏడాది ఏలికలో తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే అని మండిపడ్డారు. కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా అని ప్రశ్నించారు. ఇది విజయోత్సవం కాదని, కుంభకోణాల కుంభమేళా అని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసినందుకు జరపాల్సింది విజయోత్సవాలు కాదు.. ప్రజావంచన వారోత్సవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీలో రూ.లక్షన్న కోట్ల మూటల వేట, కొడంగల్ లిఫ్టు ఇరిగేషన్లో రూ.వేల కోట్ల కాసుల వేట, బావమరిదికి అమృత్ టెండర్లు, మంత్రుల కుమారులకు రూ.వేల కోట్ల కాంట్రాక్టులని విమర్శించారు. సీఎం, మంత్రులు చేసుకోవాల్సింది విజయోత్సవాలు కాదు.. కరప్షన్ కార్నివాల్ అంటూ మండిపడ్డారు. పరిపాలనా వైఫల్యాలకు కేరాప్ కాంగ్రెస్ సర్కారంటూ విమర్శించారు. సంక్షోభం తప్ప సంతోషం లేని పాలనకు చిరునామా రేవంత్ సర్కార్ అని నిప్పులు చెరిగారు. ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. పేదల ఇండ్లు కూల్చి రోడ్డున పడేసిన కాంగ్రెస్ సర్కార్కు అసలు మనసే లేదంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
‘కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా?. ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సింది విజయోత్సవాలు కాదు.. కుంభకోణాల కుంభమేళా. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసిన నేపథ్యంలో జరపాల్సింది విజయోత్సవాలు కాదు.. ప్రజావంచన వారోత్సవాలు. ఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అంటే.. మూసీలో లక్షన్నర కోట్ల మూటల వేట..! కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట. బావమరిదికి అమృత్ టెండర్లను, కొడుకులకు వేలకోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు.. కరప్షన్ కార్నివాల్.
ఏడాది కాలంగా ప్రతిరోజూ పరిపాలనా వైఫల్యాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కారు. సకల రంగాల్లో సంక్షోభం తప్ప సంతోషం లేని సందర్భాలకు చిరునామా రేవంత్ పాలన. మరి, ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు నిర్వహిస్తారు. ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా అమలుచేయకుండా జనం పైసలతో 25 రోజులపాటు జల్సాలు చేసుకుంటారా?.
రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం అందక పేద రైతులు దుఖంలో ఉంటే మీరు వందల కోట్లతో విజయోత్సవాలు చేసుకుంటారా?. హైడ్రా, మూసీ బాధితులు బాధలో ఉంటే మీరు బాజాభజంత్రీలతో పండుగ చేసుకుంటారా?. ఆడబిడ్డలు రక్షణ లేక అల్లాడుతుంటే మీరు విజయోత్సవాల పేరిట విర్రవీగుతారా?. వృద్ధులు పింఛన్ల పెంపు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే మీరు దయలేకుండా దావత్ లు చేసుకుంటారా?. బీఆర్ఎస్ భర్తీచేసిన ఉద్యోగాల ప్రక్రియను మీ ఖాతాలో వేసుకోవడం నయవంచన కాదా ?. పావుశాతం కూడా రుణమాఫీ పూర్తిచేయకుండా వందశాతం చేశామని చెప్పుకోవడం దగా కాదా?. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ పథకాలకు సవాలక్ష ఆంక్షలు పెట్టి మెజారిటీ అర్హులను దూరం చేయడం మోసం కాదా?.
75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో అతితక్కువ సమయంలో అత్యధిక ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న తొలి ప్రభుత్వం, ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదే.
ఈ ముఖ్యమంత్రికి పాలనపై పట్టు కాదు.. ఈ ప్రభుత్వానికి తెలంగాణపై ప్రేమలేదు. పేదల ఇళ్లు కూల్చి రోడ్డున పడేసిన కాంగ్రెస్ సర్కారుకు అసలు మనసే లేదు. విజయోత్సవాలు అంటే ఏంటో కూడా తెలియని ఈ అసమర్థ పాలకులకు ఆ పదాన్ని వాడే హక్కే లేదు.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ?
ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే..!!కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సింది విజయోత్సవాలు కాదు.. “కుంభకోణాల కుంభమేళా”. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసిన నేపథ్యంలో… pic.twitter.com/3snHneVYc5
— KTR (@KTRBRS) November 10, 2024