KTR | తెలంగాణలో ప్రజల్లో నిండిన ఆత్మస్థయిర్యానికి ఎలా వెలకడుతరు? ఇవాళ తెలంగాణలో మీరు వదిలిపోయిన నాడు 2014లో భూముల విలువ రూ.50వేలు ఉంటే.. ఇవాళ రూ.5లక్షలు అయ్యింది. ఆ రోజు రూ.5లక్షలు ఉంటే.. ఇవాళ రూ.25లక్షలు అయ్యింది. ఇది వాస్తవం కాదా? రాష్ట్రంలో పెరిగిన సంపదకు కేసీఆర్ ప్రభుత్వం కారణం కాదా? ఆలోచించాలి అని కేటీఆర్ అన్నారు. స్వేదపత్రం పరవర్ పాయింట్ ప్రజంటేషన్ను ఆదివారం తెలంగాణ భవన్లో ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణలో వ్యక్తిగత సామాజిక భరోసాకు పెద్దపీట వేశాం. ఆ పెరిగిన ఆత్మస్థయిర్యానికి ఎట్ల వెలగడుతరు? పేదిండి ఆడబిడ్డ మొహంలో కల్యాణలక్ష్మి ద్వారా వచ్చిన చిరునవ్వుకు ఎలా వెల కడుతరు? రాష్ట్రం నలుమూలల రేట్లు పెరిగిన భూములకు ఎలా వెలకడుతరు? ఫ్లోరోసిస్కు పాతరవేయడం ద్వారా వచ్చిన స్థయిర్యాన్ని.. ఆ తల్లి నేను నా పిల్లలకు విషయం తాగిస్తలేను.. మంచినీళ్లు తాగిస్తున్న అనే ఒక ఆత్మస్థయిర్యానికి ఎలా వెల కడుతరు? అని ప్రశ్నించారు.
‘ప్రతి భూగర్భజలాలకు ఎలా వెల కడుతరు? పెరిగిన పచ్చదానికి, శాంతిభద్రతల పరిరక్షణతో పెరిగిన నమ్మకానికి ఎలా వెల కడుతారు? ఇవాళ ప్రజావాణి అని మాట్లాడుతున్నరు. పది జిల్లాలు అప్పగిస్తే 33 జిల్లాలు చేసి.. 33 మంది కలెక్టర్లను ప్రజల వద్దకు తీసుకువచ్చి.. పరిపాలన చేరువ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? మా కరీంనగర్ జిల్లా ను ఊదాహరణగా తీసుకుంటే.. ఎక్కడి మంథని.. మహదేవ్పూర్.. ఎక్కడికి కరీంనగర్ ? అక్కడికి వెళ్లే అవసరం లేకుండా పెద్దపల్లికి తెచ్చింది కేసీఆర్ కాదా? గంభీరావుపేట నుంచి కరీంనగర్కు పోయే దుస్థితి నుంచి, అలంపూర్ నుంచి మహబూబ్నగర్కు వెళ్లే దుస్థితి నుంచి ఇవాళ సిరిసిల్ల, గద్వాలను జిల్లా చేసింది కేసీఆర్ కాదా? ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడో చెన్నూరు.. ఎక్కడో కాగజ్నగర్. మూల నుంచి ఆదిలాబాద్కు వెళ్లాలి. అదిలాబాద్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఒక వైపు మంచిర్యాల, నిర్మల్ జిల్లా చేసింది కేసీఆర్ కాదా? ప్రజల వద్దకు పాలన తెచ్చింది కేసీఆర్ కాదా?’ అంటూ ప్రశ్నించారు.
‘పెట్టుబడులకు స్వర్గధామం చేశాం.. రాష్ట్రానికి ఆదాయం పెంచాం. విద్యను, భవిష్యత్ను నిర్మాణం చేశాం. మా దృష్టిలో ఆస్తులు అంటే.. నిర్మాణాలు కాదు.. ప్రజల్లో పెరిగిన జీవన ప్రమాణాలు. ఆస్తులు అంటే పెరిగిన రాష్ట్ర ప్రతిష్ఠ.. ప్రతి కుటుంబంలో పెరిగిన ఆత్మవిశ్వాసం. స్వల్పకాలంలోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధించాం. ఇదే మేం సాధించిన అతిపెద్ద విజయంగా భావిస్తున్నా. ఈ ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. పెట్టిన ఖర్చు కంటే.. పెరిగిన సంపద పదులరెట్లు పెరిగింది. సాగునీరు, గ్రామాల అభివృద్ధితో భూముల విలువ పెరిగింది. 1.50కోట్ల ఎకరాల పట్టాభూమి విలువై కనీసం ఐదురెట్లు పెరిగింది. వాళ్లు 6లక్షల కోట్లు అప్పు చేశామంటున్నారు.. కానీ 50లక్షల సంపదను సృష్టించాం.
దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నది. పాలన చేతగాక శ్వేతపత్రం పేరుతో చేతులెత్తిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగం, ప్రజల తరఫున ‘స్వేదపత్రం’ విడుదల చేస్తున్న సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న. ‘పొలాల నన్నీ హలాల దున్నీ.. ఇలాతలంలో హేమం పిండగ.. జగానికంతా సౌఖ్యం నిండగ.. విరామ మెరుగక పరిశ్రమించే.. బలం ధరిత్రికి బలి కావించే.. కర్షక వీరుల కాయం నిండా కాలువకట్టే ఘర్మజలానికి.. ఘర్మజలానికి, ధర్మజలానికి, ఘర్మజలానికి ఖరీదు లేదోయ్’ అని శ్రీశ్రీ చెప్పారు. తెలంగాణ అనేది మన సమష్టి సంపద. ఒక ప్రభుత్వం, పార్టీది, వ్యక్తి కాదు. నాలుగు కోట్ల సమష్టి సంపద. దీన్ని ఎవరూ గౌరవ పరిచే ప్రయత్నం చేసినా సహించం. తెలంగాణ అనే టార్చ్బేరర్.. దీప స్తంభంగా మారిన తెలంగాణను ఆరిపోనివ్వం.. ఆగిపోనివ్వం. ప్రజల పక్షాన నిలబడతాం.. పోరాడుతాం’ అని స్పష్టం చేశారు.