హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం పునాదులు తవ్వుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూల్చుతాం, పేల్చుతాం అంటూ అరాచకానికి ఒడిగడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము వేలకోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటుపరం చేస్తున్నదని ధ్వజమెత్తారు. శుక్రవారం అసెంబ్లీలో పరిశ్రమల శాఖపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ అని గొప్పలు చెప్తున్న ప్రధాని నరేంద్రమోదీ, ఔషధ రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు అనుమతివ్వటంతో దేశీయ కంపెనీలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు.
కూల్చివేతగాళ్లతో జాగ్రత్త
కాంగ్రెస్, బీజేపీ నేతల తీరుపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఒకాయన ప్రగతిభవన్ను, మరొకాయన సెక్రటేరియట్ను కూలగొడతామని అంటున్నారు. మేము పునాదులు తవ్వుతామంటే మరొకాయన సమాధులు తవ్వుతామని అంటాడు. ఇంకొకాయన బాంబులు పెట్టి పేల్చేస్తామంటాడు. ఇటువంటి అరాచక శక్తుల చేతులో రాష్ట్రం పడితే ఏమవుతుందో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. పచ్చగా ఉన్న తెలంగాణను అరాచక శక్తులు, పిచ్చివాళ్ల చేతిలో పెట్టవద్దు. ప్రముఖ జర్నలిస్టు సుచేతా దలాల్ ఇటీవల రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీని సందర్శించి హైదరాబాద్ ముందు ముంబై చాలా పేదగా కనిపిస్తున్నదని ట్వీట్ చేశారు. పిట్ట కథలు, కట్టుకథలు చెప్తే పెట్టుబడులు రావు’ అని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 163 ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మి 9.19 లక్షల మంది ఉద్యోగుల పొట్ట కొట్టిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
రిజర్వేషన్ల ప్రకారం ఇందులో దళిత, గిరిజన, బీసీ ఉద్యోగులు ఉంటారని, ఆయా సంస్థలను అమ్మడంవల్ల వారంతా వీధినపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మేము స్టార్టప్ అంటే మీరు ప్యాకప్ అంటున్నారు. గత ఎనిమిదేండ్లలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేసింది. ఇదే సమయంలో మేం తెలంగాణలో పరిశ్రమలకు ఇప్పటివరకు రూ.3,933 కోట్లు రాయితీలుగా ఇచ్చాం. మరో రూ.3,400 కోట్లు పెండింగులో ఉన్నాయి. ఎన్ని సమస్యలున్నా దళితబంధు వంటి సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ను ప్రారంభించి 249 యూనిట్లకు ఆర్థికసాయం చేశాం. మొత్తం 1,170 యూనిట్లు మునిగిపోకుండా కాపాడాం’ అని కేటీఆర్ తెలిపారు.
నేతన్నను కాపాడాం
చేనేత పరిశ్రమను, నేత కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకొంటూ వస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ రంగానికి ఉమ్మడి ఏపీలో రూ.70 కోట్లే బడ్జెట్లో ఇచ్చారని, ఇప్పుడు రికార్డుస్థాయిలో నిధులు ఇస్తున్నామన్నారు. నేత పరిశ్రమపై ప్రధాని మోదీ, బీజేపీ కత్తిగట్టాయని విమర్శించారు. ఏ ప్రధానీ చేయనివిధంగా చేనేతపై 5 శాతం పన్ను విధించారని మండిపడ్డారు. అది చాలక పన్నును 12 శాతానికి పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డును, ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డును రద్దుచేశారు. ఆల్ ఇండియా జూట్ బోర్డు స్థానిక కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలించారు. థ్రిఫ్ట్ ఫండ్లో నాలుగు శాతాన్ని రద్దు చేశారు. బున్కర్ బీమా పథకాన్ని రద్దు చేశారు. మార్కెట్ ఇన్సెంటివ్ పథకాన్ని రద్దు చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఇవ్వాలని కోరినా ఫలితం లేదు. నేషనల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇవ్వాలని కోరినా స్పందన లేదు’ అని విమర్శించారు.
జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు
రాష్ట్రలో జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకొంటున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ’16 వేల అక్రెడిటేషన్ కార్డులు ఉన్న రాష్ట్రం మరొకటి లేదు. గుజరాత్లో 3,000 అక్రెడిటేషన్ కార్డులే ఉన్నాయి. కలం వీరులు తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచారనే ఉద్దేశంతో రూ. 100 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశాం. తెలంగాణ మీడియా అకాడమీకి రూ.42 కోట్లు ఇప్పటికే విడుదల చేశాం. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. ఒక లక్ష చొప్పున, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున ఇస్తున్నాం. మరణించిన జర్నలిస్టు కుటుంబానికి ఐదేండ్లపాటు రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తున్నాం. వారి కుటుంబంలో ఇద్దరు పిల్లలకు పదో తరగతి వరకు నెలకు రూ.1,000 చొప్పున ట్యూషన్ ఫీజు కూడా చెల్లిస్తున్నాం. ఉన్నత విద్యకోసం రూ.లక్ష, విదేశాల్లో జర్నలిజం కోర్సులు చదివేవారికి రూ.ఐదు లక్షలు సహాయం చేస్తున్నాం. కొవిడ్ సమయంలో చనిపోయిన, అనారోగ్యంపాలైన జర్నలిస్టులకు రూ.6.88 కోట్ల ఆర్థిక సహాయం అందించాం.
ప్రైవేటు స్కూల్ టీచర్లను కూడా ఆదుకొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మానవీయ కోణం అనేది రాష్ట్ర ప్రభుత్వ ట్యాగ్లైన్. జర్నలిస్టు సంక్షేమ నిధి నుంచి 5,509 మందికి రూ.17.61 కోట్ల ఆర్థిక సహాయం చేశాం. రూ.15 కోట్లతో జర్నలిస్టు భవన్ నిర్మాణం చేపట్టాం. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో సురవరం ప్రతాప్రెడ్డి ఆడిటోరియం పునరుద్ధరణకు రూ.2.30 కోట్లు కేటాయించాం. సోమాజిగూడ ప్రెస్క్లబ్కు కూడా రూ. 83 లక్షలు కేటాయించాం. చాలా జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చాం. ఇంకా ఎక్కడైనా ఇవ్వకపోతే ఇచ్చే బాధ్యత మాదే. 16,337 అక్రెడిటెడ్ జర్నలిస్టులే కాకుండా వారి కుటుంబ సభ్యులు 48,692 మందికి హెల్త్కార్డులు జారీచేశాం. 65,029 మందికి హెల్త్కార్డుల ద్వారా చికిత్సలు అందిస్తున్నాం. 2015 నుంచి ఇప్పటివరకు చికిత్సల కోసం రూ.33.44 కోట్లు ఖర్చుచేశాం’ అని కేటీఆర్ తెలిపారు.
ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ
ఐటీని కరీంనగర్, ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల్లో కూడా విస్తరించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మహబూబ్నగర్, నిజామాబాద్, సిద్దిపేట, నల్లగొండ తదితరచోట్ల కూడా ఐటీ హబ్ల నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. త్వరలో మలక్పేట్లో ఐటీ టవర్ను ఏర్పాటు చేస్తామని, పోచారం, ఉప్పల్లో సైతం ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వందే భారత్ రైళ్లతోపాటు గుండెకు వేసే స్టెంట్ల తయారీకి కూడా తెలంగాణ కేంద్రంగా మారిందని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రాన్ని సుల్తాన్పూర్లో ఏర్పాటు చేశారని చెప్పారు. మేధా సర్వో డ్రైవ్స్ అనే ప్రైవేటు సంస్థ చేవెళ్లలో పెద్ద కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నదని, వందేభారత్ రైళ్లూ తయారవుతాయని పేర్కొన్నారు. ‘సీఎం కేసీఆర్ నిర్ణయాతో రాష్ట్రంలో హరిత, నీలి, గులాబీ, పసుపు, శ్వేత విప్లవాలు సాకారమయ్యాయి. ఆహారశుద్ధి పరిశ్రమలు 16 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాం. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా, పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా అవతరించా’మని తెలిపారు.
72,240 కోట్ల డాటాసెంటర్ల పెట్టుబడులు
‘డాటా పాలసీ వల్ల అమెజాన్ వెబ్ సర్వీసెస్ రూ.36,300 కోట్ల పెట్టుబడి, మైక్రోసాఫ్ట్ రూ. 32,000 కోట్లు, ఎయిర్టెల్ రూ.2000 కోట్లు, క్యాపిటల్ లాండ్ రూ.1200 కోట్లు, ఇంకా మరికొన్ని కంపెనీలు కలిపి మొత్తం రూ.72,240 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి’ అని వివరించారు. టీఎస్ఐపాస్తో రూ.3.32 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో నాలుగు ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యాలీలు ఏర్పాటు చేస్తున్నామని, మహీంద్రా కంపెనీ రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించిందని చెప్పారు.
100% ఎఫ్డీఐతో దేశీయ సంస్థలు మూత
టీప్రైడ్ తరహాలోనే ముస్లింలకు టీప్రైమ్ తెచ్చేందుకు కృషిచేస్తామని కేటీఆర్ తెలిపారు. తన దావోస్ పర్యటనతో రాష్ర్టానికి వేలకోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ‘ఏమీలేని ఉత్తరప్రదేశ్కు బల్క్డ్రగ్ పార్క్ను మంజూరు చేశారు. దేశంలో 40 శాతం ఔషధాలు తయారుచేసే తెలంగాణకు ఇవ్వరా? మూడింట ఒక వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్లోనే తయారవుతున్నాయి. ఫార్మాలో వందశాతం ఎఫ్డీఐని అనుమతించటంతో దేశీయ సంస్థలు పోటీని తట్టుకోలేక మూతపడే పరిస్థితి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
20 లక్షల కోట్ల ప్యాకేజీపై కేంద్రం శ్వేతపత్రం ఇవ్వాలి
కొవిడ్ సంక్షోభానంతరం కేంద్ర ఆర్థికమంత్రి రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చినట్టు ప్రకటించారని, ఈ నిధులతో ఎన్ని ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలను ఆదుకొన్నారో శ్వేతపత్రం విడుదలచేసే ధైర్యం కేంద్రానికి ఉన్నదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీతో 20 మందికన్నా లాభం జరిగిందా? అని నిలదీశారు.
కేంద్రాన్ని గల్లాపట్టి అడగండి ;ఈటలకు మంత్రి కేటీఆర్ సవాల్
రాష్ర్టానికి ఏమాత్రం సహకరించని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గల్లా పట్టి అడగాలని మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. శుక్రవారం శాసనసభలో ఐటీ, పరిశ్రమలశాఖపై జరిగిన చర్చలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం సింగరేణికి బకాయిపడ్డ సొమ్ము ఇవ్వాలని ఈటల చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. బీజేపీకి రాష్ట్రంపై విషం చిమ్మడం తప్ప విషయం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాలుగు కోల్బ్లాక్లను సింగరేణికి కేటాయించకుండా చేసిన వాళ్లకు ఆ సంస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పారు. సింగరేణిని సైతం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మాదిరిగా సిక్ యూనిట్గా మలచి, ఆ తరువాత ప్రైవేట్పరం చేయాలనే కేంద్రం కుట్రలను బీజేపీ నేతలు నిలదీయాలని డిమాండ్ చేశారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు గనులు కేటాయించినట్టుగానే సింగరేణికి ఎందుకు కేటాయించరో కేంద్రాన్ని అడగాలని సవాల్ చేశారు. ‘ఇక్కడ ప్రేమ ముచ్చట్లు చెప్పడం కాదు రాజేంద్రన్నా.. తెలంగాణ మీద ప్రేమ ఉంటే కేంద్రాన్ని గల్లా పట్టి అడగండి’ అని హితవు చెప్పారు.
తెలంగాణ నూతన సచివాలయ డోమ్ను కూల్చుతామన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై సోషల్మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్