KTR | హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పథకంలోనూ కోతలు పెడుతుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సీఎం అంటే కటింగ్ మాస్టరా?’ అంటూ ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా నిలదీశారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రతి పథకంలోనూ సవాలక్ష కొర్రీలు, కోతలు పెట్టి ఎవరికి ప్రయోజనం కలిగిస్తున్నారని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి గారూ.. సీఎం అంటే ‘కటింగ్ మాస్టరా’? ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా? సీఎం అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘నాడు.. పరుగుపరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు. నేడు రూ.2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. మొదలు రూ.39 వేల కోట్లు అని, ఇప్పుడు రూ.31 వేల కోట్లకు కటింగ్ పెట్టి కుదించారు. పాసుబుకులు లేవనే నెపంతో లక్షల మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించం.
రేషన్కార్డు సాకు చూపి లక్షల మందికి మొండిచెయ్యిచ్చే కుతంత్రం చేస్తే భరించం. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొందరికి, చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని మరికొందరికి శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకోం’ అని హెచ్చరించారు. మొన్న.. లక్షలాది మందిని రూ.500 సిలిండర్ పథకానికి దూరం చేశారు. నిన్న 200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారు. నేడు రూ.2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొట్టి లక్షలాది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదు. నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధు ఇప్పటికీ దికులేదు. ఓట్ల పండగ ముగిసినా ఎకరానికి రూ.7,500 రైతుభరోసాకు అడ్రస్సే లేదు. కాంగ్రెస్ ప్రచారంలో ‘అందరికీ అన్నీ’ అన్నారు. అధికారంలోకి రాగానే ‘కొందరికే కొన్ని’ అని కోతపెడుతున్నారు. రుణమాఫీపై మాట తప్పినా, మడమ తిప్పినా, లక్షలాది రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తాం, పోరాడుతాం. జై కిసాన్ జై తెలంగాణ’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తున్నది. వేలాది వ్యూస్, కామెంట్లు వస్తున్నాయి. ‘సీఎం అంటే కటింగ్ మాస్టరే కాదు.. పెద్ద కన్నింగ్ మాస్టర్ కూడా’ అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.