హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): పెట్రోల్, డీజిల్తోపాటు వంట గ్యాస్ ధరలను భారీగా పెంచుకుంటూ పోయిన కేంద్ర ప్రభుత్వం.. కండితుడుపు చర్యగా ధరలను స్వల్పంగా తగ్గించింది. అయినా ఇప్పటికీ పెట్రో ధరలు సామాన్యుడిపై పెను భారాన్ని మోపేలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కారణం ఏంటి? దానికి బాధ్యులు ఎవరు? ముందుగా ధరలు పెంచింది ఎవరు? ఇప్పుడు తగ్గింపు పేరుతో ప్రజలను మోసం చేస్తుంది ఎవరు? అంటూ ప్రశ్నించారు. మోదీ ప్రధాని కాకముందు.. అయ్యాక.. క్రూడాయిల్ ధరలు తగ్గాయి కానీ పెరుగలేదని, అయినా ధరలు మాత్రం భారీగా ఎందుకు పెరిగాయని నిలదీశారు. ‘మే 2014, మే 2022లో క్రూడ్ ఆయిల్ ధర ఏ మాత్రం పెరగలేదు. కానీ, అప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.70 ఉంటే ఇప్పుడు రూ.120కి చేరింది. తెలంగాణలో వ్యాట్ అప్పడూ, ఇప్పుడూ ఏ మాత్రం మారలేదు. మరి ధరలు పెరిగేందుకు కారణం ఏంటి? దీనికి బాధ్యులు ఎవరు? స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్, అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ ఇవన్నీ ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం విధించిన పెంపులో భాగమే. ఈ పన్నుల్లో దేనిలోనూ రాష్ర్టాలకు పైసా వాటా కూడా లేదు. కేంద్రం ఈ సెస్ను రద్దు చేస్తే ఇంధన ధరలు 2014 నాటి స్థాయికి చేరుకుంటాయి’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. మోదీ ప్రధాని కాకముందు, అయ్యాక ధరల వివరాలను షేర్ చేశారు.
పెట్రోల్పై పెంచింది రూ.18.42 తగ్గించింది రూ.8
‘నా స్కూల్ పక్కన ఉన్న ఓ దుకాణాదారుడు పీక్ సీజన్లో ధరలను 300 శాతం పెంచి.. ఆపై ప్రజలను మోసం చేయడానికి దానిని 30 శాతం తగ్గించే వాడు. అతని సన్నిహితులు దాన్ని బంపర్ ఆఫర్గా అభివర్ణిస్తూ.. అతనికి ధన్యవాదాలు తెలిపేవారు. ఇది ఎక్కడో విన్నట్లు అనిపిస్తుందా..? ముందుగా ధరలు పెంచింది ఎవరు?’ అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ప్రశ్నించారు. దీనికి నెటిజన్లు ‘ఇలాంటి పని చేసేది ఇంకెవరూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం’ అంటూ సమాధానాలు ఇచ్చారు. ‘పెట్రోలుపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 2014లో రూ.3.57 ఉంటే.. అది 2022 నాటికి రూ.27.90 అయింది. అంటే కేంద్రం రూ.18.42 పెంచింది. ఇప్పుడు తగ్గించింది రూ.8. డీజిల్పై 2014లో 3.57 ఉంటే.. అది 2022 నాటికి రూ.21.80 అయింది. అంటే రూ.18.23 పెంచింది, ఇప్పుడు తగ్గించింది రూ.6. పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత.. తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో వ్యాట్ను ఒక్కపైసా కూడా పెంచలేదు’. ‘మోదీ ఫిల్లింగ్ స్టేషన్.. పెట్రోల్, డీజిల్పై సెస్- ఎక్సైజ్ డ్యూటీని భారీగా పెంచారు. యూపీ ఎన్నికల తరువాత ఎవరూ ఊహించనంతగా ధరలు పెంచారు. కానీ ఇప్పుడు దాన్ని స్వల్పంగా తగ్గించారు. దీన్నే మోదీ స్ట్రోక్’ అంటారు అంటూ కేటీఆర్ ట్వీట్లు చేశారు.
సాకెత్ గోఖలే ట్వీట్ రీట్వీట్
పెట్రో ధరల తగ్గింపుపై తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే చేసిన ట్వీట్ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. పెట్రో ధరల తగ్గింపుతో రాష్ర్టాలకు రావాల్సిన రాబడి పోయిందని, ఈ విషయాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బయటికి చెప్పడం లేదని సాకేత్ గోఖలే విమర్శించారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరే ఇంధన సెస్సును ఏ మాత్రం తగ్గించలేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ‘స్పిన్ డాక్టర్ నిర్మలా సీతారామన్.. ప్రజలకు చెప్పని విషయం ఏంటంటే పెట్రో ధరలపై వసూలుచేసే ఎక్సైజ్ డ్యూటీలో 42 శాతం వాటా రాష్ర్టాలది. నిన్నటి కోతలతో రాష్ర్టాలు పెట్రోల్పై లీటరుకు రూ.2.52, డీజిల్పై లీటరుకు రూ.3.36 రాబడిని కోల్పోతున్నాయి. ఆర్థిక మంత్రి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఇంధన సెస్సును మాత్రం తగ్గించ్చకుండా వదిలేశారు. ఇది కంటి తుడుపు చర్య’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.