హైదరాబాద్/సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ప్రకృతి సౌందర్యం, పక్షుల కిలకిలరావాల మాధుర్యాన్ని గ్రహించిన తొమ్మిదేండ్ల బాలుడు సంహిత్ చితాజల్లు ‘వింగ్డ్ ఫ్రెండ్స్-బర్డ్స్ ఆఫ్ బొటానికల్ గార్డెన్స్ హైదరాబాద్’ అనే పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకాన్ని గురువారం పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారక రామారావు ప్రగతిభవన్లో ఆవిష్కరించారు. మాస్టర్ సంహిత్ భవిష్యత్తులో మరింతగా రాణించాలని మంత్రి ఆకాంక్షించారు. అతడికి అవసరమైన సహకారం అందించాలని తెలంగాణ సాంస్కృతికశాఖను ఆదేశించారు. తనకు అడవులంటే ఎంతో ఇష్టమని, అదే తనను పుస్తకం రాసేలా ప్రోత్సహించిందని సంహిత్ పేర్కొన్నాడు. భారీగా చెట్లు నాటడం, పార్కులను ఏర్పాటు చేయడం, అడవుల పెంపకం ద్వారా ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసినందుకుగాను మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపాడు. దీనివల్ల రంగురంగుల పక్షులను చూసే భాగ్యం లభించిందని, సహజసిద్ధంగా పక్షుల జీవన విధానం ఎలా ఉంటుందో చూసే అవకాశం దక్కిందని సంహిత్ చెప్పాడు.
చైనా పేర్లు మార్చుతున్నా పట్టని ప్రధాని మోదీ: మంత్రి కేటీఆర్
భారత్లోని గ్రామాల పేర్లను చైనా మార్చుతుంటే ప్రధాని మోదీ మాత్రం బిజీగా ఉన్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. చైనా మన దేశంలోని గ్రామాల పేర్లు మార్చడం ఇది మూడోసారని, 2017, 2021తోపాటు తాజాగా మరోసారి ఇదేతరహా చర్యకు పాల్పడిందని ఆయన ట్విట్టర్ వేదికగా గుర్తుచేశారు. అరుణాచల్ప్రదేశ్లోని 11 ప్రాంతాల పేర్లను చైనా మార్చిందని పేర్కొంటూ, ఈ మేరకు వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను ట్యాగ్ చేశారు. అయినా దీనిపై ఇంతవరకు ప్రధాని స్పందించపోవడాన్ని మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. మరికొన్ని చైనీస్ యాప్లను నిషేధించి చైనాకు ‘ఎర్రటి కళ్లు’ (లాల్ ఆంఖ్) చూపిద్దాం.. అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.