హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన విద్యార్థుల మరణాలన్నీ సర్కార్ హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గడిచిన రెండేండ్ల్లలో సుమారు 112 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయని, వీటివల్ల 2,422 మంది విద్యార్థులు దవాఖానల పాలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా 123 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఇవి ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. విద్యార్థుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని వర్గాల ప్రజలు రోడ్డెకి నిరసన తెలుపుతున్నారని గుర్తుచేశారు.
కనీస అవసరమైన నాణ్యమైన భోజనం కోసం పాఠశాల విద్యార్థులు సైతం నిరంతరం పోరాటాలు చేయాల్సి రావడం కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. జనగామ జిల్లా గూడూరు గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులు తమకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పాలకుర్తి- స్టేషన్ఘన్పూర్ ప్రధాన రహదారిపై బైఠాయించిన ఘటన ప్రభుత్వ అసమర్థతను చాటిచెప్తున్నదని విమర్శించారు.
ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు దాటినా నేటికీ తెలంగాణకు పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న రేవంత్రెడ్డి, విద్యార్థుల సమస్యలు పరిషరించడం మానేసి కేవలం రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లపైనే దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. విద్యా వ్యవస్థను గాలికి వదిలేసి, పాలనను విస్మరించిన ముఖ్యమంత్రి తీరు వల్ల రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడుతున్నదని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఎంతో కీలకమైన ఈ దశలో ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి లోనుకావద్దని తెలిపారు. ‘ప్రశాంత చిత్తం, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి విజయాన్ని సాధించాలి.. మీ శ్రమకు తగ్గ ఫలితం కచ్చితంగా లభిస్తుంది’ అని భరోసా నింపారు. విద్యార్థులంతా క్రమశిక్షణ, ఏకాగ్రతతో పరీక్షలు రాసి ఉత్తమ మారులు సాదించి ఉత్తీర్ణులు కావాలని ఆశీర్వదించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, వారికి కావాల్సిన ప్రశాంత వాతావరణాన్ని కల్పించడంలో అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.