సిరిసిల్ల: కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీ. వినోద్ కుమార్కు మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సిరిసిల్ల పట్టణంలో ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని రైతుబజార్లో బీఆర్ఎస్కు ఓటేయాలని రైతులు, వ్యాపారులను కోరారు. వారి కష్టసుఖాలను అడిగితెలుసుకున్నారు. అక్కడే ఉన్న ఓ హోటల్లో స్థానికులతో కలిసి చాయ్ తాగారు. అనంతరం మాట్లాడుతూ.. ఓట్లు అడిగేందుకు రైతు బజారుకు వచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా తాము కూర్చుని కూరగాయలు అమ్ముకునేలా షెడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని రైతులు కోరారని చెప్పారు. దీంతో 24 గంటల్లోపు వారికి తాత్కాలిక వసతి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని, కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత తమ వాగుల్లో నీళ్లు పోయాయని, ఓ నెల పింఛన్ కూడా రాలేదని ఆవుదర వ్యక్తంచేశారని తెలిపారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే పేదలకు బాగుంటుందని అంతా అన్నారని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారని, రుణమాఫీ జరగలేదని, రైతుబంధు ఇంకా సరిగా రాలేదన్నారని తెలిపారు. వారి స్పందన చూస్తుంటే కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్ మంచి మెజార్టీతో గెలుస్తారని నమ్మకముందని చెప్పారు.