KTR | బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి, పోలీసులే దాడి చేయించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్రలా రేవంత్ ప్రభుత్వం కొనసాగుతుందని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి, రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి మోసం చేశారని కేటీఆర్ అన్నారు.
ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇంటికి చేరి, కాళ్లు పట్టుకొని మరి కండువాలు కప్పుతాడని కేటీఆర్ విమర్శించారు. పది మంది ఎమ్మెల్యేలు పోయారు, ఇంకా వస్తారు అని కాంగ్రెస్ మంత్రులు నుంచి ఎమ్మెల్యేల వరకు మాట్లాడుతున్నారని అన్నారు. హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్లో భయం మొదలైందని తెలిపారు. ఫిరాయింపులపై స్పీకర్ను కలిసి సుప్రీం కోర్టు తీర్పులను సైతం ఉటంకిస్తూ పిర్యాదు చేశామని చెప్పారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి మీద డిస్ క్వాలిఫై పిటిషన్ వేసింది కౌశిక్ రెడ్డి అని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున హైకోర్టు జస్టిస్కు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి, చావు డప్పులు కొట్టండి అని నాడు రేవంత్ రెడ్డి మాట్లాడారని కేటీఆర్ అన్నారు. కానీ హైకోర్టు తీర్పు వచ్చిన రోజు అరికెపూడి గాంధీని PAC చైర్మన్గా నియమిస్తూ ప్రకటన చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ ఎలా నియమిస్తారని అని ప్రశ్నిస్తే, పోలీసుల అండతో ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగారని మండిపడ్డారు. ఈ రకమైన గుండాగిరి పదేళ్లలో ఎప్పుడూ లేదని తెలిపారు. ఫ్యాక్షన్ సినిమాలు తలపించేలా దాడులు చేశారని అన్నారు. రేపు జరగకూడనిది జరిగితే, ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో ఇప్పటికైనా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇంతక ముందు ఉన్న ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి నువ్వో చిట్టి నాయుడివి.. మా భాషలో చెప్పాలంటే బుల్లబ్బాయి అంటారు
నీ లాంటి బుల్లబ్బాయిలను, చిట్టినాయుడులను చాలా మందిని చూసాము.. వెంట్రుక కూడా పీకలేవు
గాంధీ నువ్వు అసలు ఏ పార్టీలో ఉన్నావు..? ముఖ్యమంత్రి కండువా కప్పి… pic.twitter.com/XGqa2P2v1r
— Telugu Scribe (@TeluguScribe) September 14, 2024
గ్యారెంటీలు అమలు చేయాలని అడిగితే ఇలాంటి హైడ్రామాలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. పైశాచిక ఆనందం కోసం ఇదంతా రేవంత్ చేస్తున్నాడని అన్నారు. కానీ ఇవన్నీ తిరిగి రేవంత్కు తిరిగి చుట్టుకుంటాయని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని స్పష్టం చేశారు.
పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి, పోలీసులే దాడి చేయించారని కేటీఆర్ అన్నారు. దాడి జరిగినప్పుడు ఇక్కడ విధుల్లో విఫలమైన పోలీసులను సస్పెండ్ చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి, అర్ధరాత్రి వరకు తిప్పితే, తెలంగాణ ప్రజలు మొత్తం తమ వెంట నిలిచారని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే తెలంగాణ ప్రజల పౌరుషం చాటారని అన్నారు. నిన్న మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి, గాంధీకి రక్షణ కల్పించారని అన్నారు. అదే గాంధీని హౌస్ అరెస్ట్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావని స్పష్టం చేశారు.
హైదరాబాద్లో పదేళ్లలో శాంతి భద్రతలు అద్భుతంగా నిర్వహించామని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో ఉన్న ప్రజలు అందరూ మా వారే అని స్పష్టం చేశారు. ప్రాంతీయతత్వం మీద దాడులు గతంలో లేవు, ఇప్పుడు ఉండవని తెలిపారు బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ ప్రజలు అండగా నిలిచారని, రేవంత్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్లో ఎందుకు చేరావని అరికెపూడి గాంధీని నిలదీశారు. దిక్కుమాలిన PAC పదవి కోసం ఇలాంటి మాటలు మాట్లాడేందుకు సిగ్గు ఉండాలని విమర్శించారు.