KTR | సైదాబాద్/ మాదన్నపేట/నాంపల్లి కోర్టులు, మే 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారమదంతో చిల్లర రాజకీయాలు చేస్తున్నదని, తమకూ సమయం వస్తుందని, అప్పుడు మిత్తితో కలిపి బదులు తీర్చుకుంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. చంచల్గూడ జైలులో ఉన్న బీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ క్రిశాంక్ను బుధవారం ఆయన ములాఖాత్ ద్వారా కలిసి పరామర్శించారు. అనంతరం జైలువద్ద మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డికి దమ్ముంటే ఆయన విడుదలచేసిన సర్క్యులర్ను, క్రిశాంక్ విడుదల చేసిన సర్క్యులర్ను నిపుణుల ముందు పెడదామని, తాము ఫోర్జరీ చేసినట్టు నిరూపిస్తే తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమని, రేవంత్ తప్పు చేసినట్టు తేలితే ఆయన జైలు వెళ్లడానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు.
క్రిశాంక్పై ఓ పనికిమాలిన కేసు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా మెస్ల మూసివేత వ్యవహారాన్ని బయటపెట్టిన క్రిశాంక్ను వారం రోజులుగా జైలులో పెట్టారని, ఫోర్జరీ చేసినవారు మాత్రం బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. తప్పుచేసిన రేవంత్ జైలులో ఉండాల్సింది పోయి బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ సిగ్గు తెచ్చుకుని చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. వెంటనే క్షమాపణ చెప్పి ఏ తప్పు చేయని క్రిశాంక్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమకు పోరాటాలు కొత్తకాదని, క్రిశాంక్ జైలులో ధైర్యంగా ఉన్నారని తెలిపారు. క్రిశాంక్ భార్య సుహాసిని కూడా ధైర్యంగా ఉన్నారని పేర్కొన్నారు. క్రిశాంక్ను పరామర్శించేందుకు కేటీఆర్ వస్తున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు వద్దకు తరలివచ్చారు.
క్రిశాంక్పై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారని క్రిశాంక్ భార్య సుహాసిని ఆరోపించారు. తప్పుడు కేసుపై ఇన్ని రోజులుగా జైలులో ఉంచుతున్నారంటేనే అనుమానాలు వ్యకమవుతున్నారని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్నవారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఇబ్బందులు పోతాయనే నమ్మకం ప్రజల్లో రావాలని తెలిపారు. న్యాయమూర్తులు జ్యోకం చేసుకొని ఇటువంటి కేసుల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బెయిల్ పిటిషన్పై తీర్పు గురువారానికి వాయిదా పడింది. 4వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి తల్లి మరణంతో సెలవువై వెళ్లడంతో ఇన్చార్జి కోర్టు 7వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. బుధవారానికి తీర్పును కోర్టు రిజర్వు చేసింది. సదరు మేజిస్ట్రేట్ సైతం బుధవారం సెలవులో ఉండడంతో కేసును 21వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ చేశారు. క్రిశాంక్ బెయిల్ పిటిషన్పై ఆయన న్యాయవాదులు తీర్పు కోరగా గురువారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వాదనలు పూర్తయినా తీర్పు ప్రకటించకపోవడంపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తంచేస్తూ నాంపల్లి కోర్టుల ఇన్చార్జి, జిల్లా జడ్జికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. గురువారం కూడా తీర్పు రాకుంటే ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.