KTR | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)ను కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన విధంగా ఉచితంగా అమలుచేయాలని బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ పేరిట 25 లక్షల మంది దరఖాస్తుదారుల నుంచి రూ.20 వేల కోట్ల వరకు వారి రక్త మాంసాలను పీల్చడానికి సిద్దమయ్యారని మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో సోమవారం మాజీ మంత్రులు సీ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, మంత్రులు..భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క తదితరులు ఎల్ఆర్ఎస్కు డబ్బులు కట్టవద్దని, తాము అధికారంలోకి రాగానే ఉచితంగా అమలు చేస్తామంటూ మాట్లాడిన వీడియోలను కేటీఆర్ మీడియాకు ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా మ్యానిఫెస్టోలో 420 హామీలు, 6 గ్యారెంటీలను ఇచ్చారని, కానీ బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలనే కొనసాగిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
మాట మార్చిన కాంగ్రెస్ నేతలు
వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని అప్పటి సీఎల్పీ నేత మల్లు భట్టివిక్క్రమార్క అసెంబ్లీ మీడియా పాయింట్లో చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి నో-ఎల్ఆర్ఎస్ నో-బీఆర్ఎస్ అన్నారని, తాము అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అ మలు చేస్తామని చెప్పారని పేర్కొన్నారు. అలాంటిది ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా 25.44 లక్షల మంది లబ్ధిదారుల నుంచి రూ.20 వేల కోట్లను దోచుకోవడానికి సిద్ధమయ్యారని దుయ్యబట్టారు.
ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు లేకుం డా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల రెగ్యులరైజేషన్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని అన్నారు. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం మార్గదర్శకాలు రూపొందించినప్పుడు, ఇదే కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడిన విషయాన్ని కేటీఆర్ సాక్ష్యాలతో సహా మీడియా ముందుంచారు.
నాడు తమ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను ప్రతిపాదించినప్పుడు.. ప్రజల నుంచి డబ్బు దోచుకోవడానికే ఈ కార్యక్రమం చేపట్టారని భట్టి విక్రమార్క విమర్శించారని, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడెందుకు ఆ పథకం అమలుకు సిద్ధపడుతున్నదని నిలదీశారు. ఒకప్పుడు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్న ఉత్తమ్కుమార్రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజలు నో కాంగ్రెస్ అంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. అప్పుడు ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఈ రోజు అడ్డగోలుగా డబ్బు లు లాకోవడంపై స్పందించాలని డిమాండ్ చేశారు.
మంత్రి సీతక డబ్బులు దోచుకోవడానికే ఎఆర్ఎస్ పెట్టారని మాట్లాడారని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి దోచుకుంటున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్పై కోర్టులో కేసు వేసిన మంత్రి కోమటిరెడ్డి ఇప్పుడు ఆ కేసును వెనకి తీసుకున్నారా లేక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో కేసు వేస్తారా అనే విషయాన్ని తెలియజేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ప్రజలపై 20వేల కోట్ల భారం
ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల మంది దరఖాస్తుదారులపై కనీసం లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.20వేల కోట్ల వరకు భారాన్ని మోపేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైందని కేటీఆర్ విమర్శించారు. ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 6న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ మోసపూరిత వైఖరికి వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.
ఈ నెల 7న ప్రతి జిల్లా కలెక్టర్కు, అర్డీవోలకు ఒక విజ్ఞాపన పత్రాలను అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ),గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయాల ముందు ప్రత్యేక నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ కార్యక్రమంలో ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించాలని, లేకుంటే భవిష్యత్తులో న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.