రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ‘స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది చేనేత పరిశ్రమ. అలాంటి పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. చేనేత ఉత్పత్తులపై విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి’ అని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో మెగా పవర్లూం క్లస్టర్ ఏర్పాటు చేయాలని పలుమార్లు వినతిపత్రాలు సమర్పించానని, స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేదిక పైనుంచి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు.
కార్మికులు, ఆసాములతోపాటు 15 వేల మందికి నిరంతరం ఉపాధి కల్పించేలా రూ.2,500 కోట్ల విలువైన బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్ దుస్తుల తయారీకి ఆర్డర్లు ఇచ్చినట్టు గుర్తుచేశారు. సిరిసిల్ల ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించిన వేడుకలకు హాజరైన మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తున్నదని, ఇందులో భాగంగా జిల్లాకో మెడికల్ కాలేజీని మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
నేతన్నకు బీమా కల్పించిన ఏకైక రాష్ట్రం
లక్ష్య సాధన దిశగా తెలంగాణ పురోగమిస్తున్నందుకు సంతోషంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తమ ప్రభుత్వం ప్రజలే కేంద్రబిందువులుగా, ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా సుపరిపాలన సాగిస్తున్నదని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, నేతన్నకు చేయూత వంటి అనేక పథకాలను చూసి దేశమే అబ్బుర పడుతున్నదని చెప్పారు. రైతుల మాదిరి నేతన్నలకు బీమా సౌకర్యం కల్పించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణే అని చెప్పుకోవడం గర్వంగా ఉన్నదన్నారు. రూ.5 కోట్ల విలువైన 1.20 కోట్ల జాతీయ జెండాలను 5 వేల మరమగ్గాలపై తయారు చేసినట్టు చెప్పారు.
ఆవిష్కరణకు వేదికగా తెలంగాణ హబ్: గూగుల్ మీట్లో మంత్రి కేటీఆర్
భారతదేశం అభివృద్ధి చెందిన అగ్రదేశాల సరసన నిలబడాలంటే ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోత్ అనే మూడు అంశాలపై నిలబడితేనే సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ‘ఇంటింటా ఇన్నోవేటర్-2022’ ద్వారా ఎంపిక చేసిన 33 జిల్లాల ఆవిష్కర్తలతో సిరిసిల్ల కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్ ద్వారా మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీ-హబ్, వీ-హబ్, అగ్రి-హబ్, కే-హబ్, బీ-హబ్ అనేక కొత్త ఆవిష్కరణలకు వేదిక అవుతున్నాయని చెప్పారు. యువతను సరైన దిశలో నడిపిస్తే సత్ఫలితాలు ఉంటాయని, ప్రతిభ ఎవరి సొత్తు కాదని, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే దేశానికి ఇన్నోవేషన్ క్యాపిటల్గా ఇండియా మారుతుందని పేర్కొన్నారు.
ఈ దేశంలో గాంధీ రాజకీయం నడుస్తుంది
-గాడ్సే మురికి రాజకీయం కాదు: మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): వజ్రోత్సవాల సందర్భం గా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్చేశారు. ఈ గొప్ప దేశం లో గాంధీ రాజకీయం నడుస్తుంది.. గాడ్సే మురికి రాజకీయం కాదు.. ఇండి యా ఎట్ 75.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజు భారతీయులందరికీ ఒక మైలురాయి లాంటిది. ఈ ప్రపంచంలో మన దేశానికి ఉన్న విశిష్టతను గౌరవించుకుందాం. మనల్ని ఏకం చేసే అంశాలపై దృష్టి పెడదాం.. మనల్ని విభజించే వాటిపై కాదు. ప్రేమ, సంతోషాన్ని పంచండి.. ఈ దేశాన్ని మరింత గొప్ప దేశంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం’ అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.