KTR | కేంద్రమంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్తో పాటు పలు మీడియా సంస్థలు, సోషల్మీడియా ప్లాట్ఫామ్లపై హైదరాబాద్ సిటి సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేయడంతో పాటు తప్పుడు కథనాలను ప్రచురించినందుకు కేటీఆర్ ఈ దావా వేశారు. తప్పుడు సమచారాన్ని తొలగించడంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారంగా రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
2025 ఆగస్టు 8న బండి సంజయ్ తప్పుడు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలలో తెలంగాణ ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) దుర్వినియోగం, ఫోన్ ట్యాపింగ్. ఆర్థిక అవకతవకలకు ముడిపెట్టారని తెలిపారు. ఏబీఎన్ తెలుగు, ఎన్టీవీ, టీవీ5, వీ6, ఏఎన్ఎన్ తెలుగు వంటి టీవీ ఛానెళ్లు, అలాగే ఇండియా టుడే, ఎన్డీటీవీ, డెక్కన్ హెరాల్డ్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్లు, అలాగే ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, గూగుల్, మెటా (ఫేస్బుక్/ఇన్స్టాగ్రామ్) వంటి సోషల్ మీడియా సంస్థలు ఈ వ్యాఖ్యలను విస్తృతంగా ప్రసారం చేశాయన్నారు. ఈ వ్యాఖ్యలు కేవలం పరువుకు భంగం కలిగించడమే కాకుండా, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయని తెలిపారు.
ఈ ఆరోపణలపై 2025 ఆగస్టు 11న లీగల్ నోటీసు పంపినప్పటికీ, బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పడానికి నిరాకరించారని.. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించానని పిటిషన్లో కేటీఆర్ పేర్కొన్నారు. బండి సంజయ్ కేవలం రాజకీయ కక్షతో “విపరీతమైన నిందారోపణలతో దుష్పచారానికి” పాల్పడ్డారని తెలిపారు.
అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి ఇటువంటి బాధ్యతారహితమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజా ప్రతినిధుల విశ్వసనీయత, గౌరవానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కూడా ఈ ఫిర్యాదులో నొక్కి చెప్పారు.
నిరాధార ఆరోపణలపై బండి సంజయ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పిటిషన్లో కేటీఆర్ డిమాండ్ చేశారు. మరోసారి తన పరువుకు నష్టం కలిగించే కంటెంట్ను ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా నిందితులను నిరోధించేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, మీడియా పోర్టల్స్లో ప్రచురించిన కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.