రాజన్న సిరిసిల్ల, మార్చి 5 (నమస్తే తలంగాణ): తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అని పరిశ్రమలు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ కంటే మంచి పథకాలు ఉన్నాయని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లాలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభంతో పాటు పలు ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ పేదలకు విద్య, వైద్యం అందించాలన్నదే ముఖ్యమం త్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. 70 ఏండ్ల చరిత్రలో ప్రభుత్వ దవాఖానాల్లో ఒక్క ఐసీయూ కేర్ సెంటర్ లేదని, స్వరాష్త్రం వచ్చిన తర్వాత ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకొన్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని కొనియాడారు. నేటి సమాజంలో మధ్య, పేదతరగతి ప్రజలకు అతిపెద్ద ఖర్చు విద్య, వైద్యమేనన్నారు. ‘మన ఊరు – మన బడి’ పేరుతో రాష్ట్రంలోని 26 వేల బడులను రూ.7,300ల కోట్లతో అభివృద్ధి చేసేందుకు యజ్ఞంలా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 8న వనపర్తిలో ముఖ్యమంత్రి చేతులమీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్టు తెలిపారు. పే దల ఆత్మగౌరవం కాపాడాలన్న ఉద్దేశంతో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్నామని, కల్యాణలక్ష్మి పథ కం పేరుతో ఆడబిడ్డకు పెళ్లి చేస్తున్న ఏకైక ప్రభు త్వం తెలంగాణేనని స్పష్టంచేశారు. ఇన్ని చేస్తున్న ప్రభుత్వంపై కొందరు పొలిటికల్ టూరిస్టులు వచ్చి ఎటుపడితె అటు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతలంతా తెలంగాణ వ్యతిరేకులని పేర్కొన్నారు. విమర్శలు చేయ డం చాలా తేలికైన పని అని.. పనులు చేసి చూపించడమే కష్టమన్నారు. సిరిసిల్ల రూపురేఖలను మార్చిన ఘనత కేసీఆర్దేనని కొనియాడారు.
ఎములాడకు రూ.100 కోట్లు తెచ్చే తెలివేమైంది
‘కాశీలో రూ.వెయ్యి కోట్లు పెట్టిండ్రు.. ఎంపీగా నీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎములాడకు ఒక రూ.వంద కోట్లు తెచ్చే తెలివేమైంది’ అంటూ మంత్రి కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని నిలదీశారు. ఏది పడితే అది అడ్డంగా మాట్లాడితే చెల్లుబాటు కాదన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు కండ్ల ముందున్నా కనిపించడం లేదా? అని ఎద్దేవాచేశారు. కులం పిచ్చి, మతం పిచ్చితో రెచ్చగొట్టే కల్లబొల్లి మాటలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ నాయకులు ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే అక్కడికక్కడే నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి.. వాళ్లేం చేస్తున్నారో? ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో క్యాన్సర్ కేర్ సెంటర్, వేములవాడలో పాలియేటివ్ కేర్ సెంటర్లను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు.
విప్లవాత్మక మార్పులతో వ్యవసాయం
వ్యవసాయ రంగం, రైతుల కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఏకైక నేత సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. రోజుకు ఆరుగంటల కరెంటు ఇస్తామని గత ప్రభుత్వాలు చెప్పినప్పటికీ, ఎన్నడూ మడిపారిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణ రాకముందు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జీవన విధ్వంసం జరిగిందన్నారు. రైతుబంధు కింద 62 లక్షల మందికి ఏడాదికి రూ.15 వేల కోట్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని గుర్తుచేశారు. 75 ఏండ్లలో కేసీఆర్ లెక్కన ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేదని పేర్కొన్నారు. రైతుల లాభ నష్టాలు, మంచిచెడులు పంచుకొనేందుకు రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. ప్రతి ఇంటి ముందు నల్లా, ప్రతిరైతుకు బీమా, ప్రతి గ్రామంలో నర్సరీ, పచ్చని చేలు కనువిందు చేస్తుంటే ప్రతిపక్షాల కండ్లు మండుతున్నాయని విమర్శించారు.
కరోనాకాలంలో వైద్య సేవలు అద్భుతం
కరోనా కష్టకాలంలోనూ వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందించిన సేవలను మంత్రి కేటీఆర్ కొనియాడారు. కంటికి రెప్పలా ప్రజలను కాపాడిన వైద్యులు, ఆశావర్కర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది నుండి మొదలుకొని పోలీసుల వరకు నిరంతరం కృషి చేశారన్నారు. తీవ్రవైన సంక్షోభం వచ్చినప్పుడే కాపాడిన వారంతా చిరస్థాయిగా మదిలో గుర్తుండి పోతారన్నారు. ఆరోగ్య తెలంగాణలో భాగంగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తయారుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
శనివారం మధ్యాహ్నం ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లెలో గ్రామ పంచాయతీభవనం, అదనపు తరగతి గదులను మంత్రి కేటీఆర్.. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి ప్రారంభించారు. తర్వాత వెంకటాపూర్లో రైతు వేదిక, ప్రగతి వేదిక, కేసీఆర్నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. తరువాత వేములవాడలో వంద పడకల దవాఖానలో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు, ఆక్సిజన్ ప్లాంట్, పీఎస్ఏ ప్లాంట్, సీటీ స్కాన్, పాలియేటివ్ కేర్ సెంటర్, పిడియాట్రిక్ వార్డులను ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుతో కలిసి ప్రారంభించారు. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుపై ప్రజలకు, ప్రజాప్రతినిధులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రజలందరి ఆరోగ్యంకోసం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చేపట్టిన కార్యక్రమాన్ని ఎవరూ రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు. ఒక్క వెంకటాపూర్ గ్రామంలోనే రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వేములవాడలో సినారె ఆడిటోరియానికి రూ.3.50 కోట్లు మంజూరి చేస్తామని, మినీ స్టేడియం నిర్మాణానికి రూ.5 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, రైతుబంధు జిల్లా చైర్మన్ గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, మాధవి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.