కొట్లాట చాతకాదు, మాట్లాడ చాతకాదు, తెలంగాణకు రూపాయి తెచ్చే తెలివి లేదు. సొంత పార్లమెంట్ నియోజకవర్గంలోనే అరపైసా పనిచేసిన పాపాన పోలేదు. కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నరంట! ఈ బిత్తిరోడు చెప్పితే ఫర్వాలేదు కానీ ఆమెకు (నిర్మలాసీతారామన్) ఏమైంది? ఆమె నిర్మలమైన మనిషి లాగ ఉండే.. ఆమె
కూడా ఆగమైంది.
– టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
మా సవాల్కు సిద్ధమా?
మునుగోడు అభివృద్ధికి రూ.18 వేల కోట్ల నిధులను కేంద్రం కేటాయిస్తే, టీఆర్ఎస్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకొంటుందన్న మంత్రి జగదీశ్రెడ్డి సవాల్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా కట్టుబడి ఉన్నా. అభివృద్ధి ముఖ్యమనే ఉద్దేశంతో ఈ సవాల్ చేస్తున్నాం.. స్వీకరిస్తారా?
మోదీపై ప్రమాణం చేస్తవా?
రాజగోపాల్రెడ్డి.. నీకు చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్టు దక్కిన వైనంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. బీజేపీ కాంట్రాక్టు వాస్తవం కాకుంటే భాగ్యలక్ష్మి దేవాలయంలో బండిపై ప్రమాణం చెయ్. యాదాద్రిలో మోదీపై ప్రమాణం చేస్తవా?
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): చావనైనా చస్తాం కానీ మోదీకి లొంగే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈడీలతో బెదిరిస్తే బెదిరే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణభవన్లో జరిగిన టీఆర్ఎస్వీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నిక ఒక కాంట్రాక్టర్ అహానికి, ఆ నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్నదని తెలిపారు. ‘బెదిరించి లోబర్చుకొంటున్నారు. బెదరకపోతే ఈడీని, బీడీని వేటకుక్కల మాదిరి ఉసిగొల్పి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మోదీకి, ఇక్కడున్న బోడికి నేను చెప్తున్నా.. మీ ఈడీ మా వెంట్రుక కూడా పీకలేదు, ఏం చేసుకుంటావో చేసుకో పో. భయపడేటోడు ఎవ్వడూ లేడు.. మేం తెలంగాణ బిడ్డలం, ఆత్మగౌరవం గల బిడ్డలం, చావనైనా చస్తాం కానీ, మీకు మాత్రం లొంగిపోయే ప్రసక్తి లేదు’ అని తేల్చి చెప్పారు.
మోదీ జవాబు చెప్పు
‘నరేంద్రమోదీ.. నీకు సిగ్గు, నీతి, నిజాయితీ, మానం, ఇజ్జత్ ఉంటే నీ మీద వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పు. శ్రీలంక ప్రభుత్వంలోని పెద్దలు, విద్యుత్తుశాఖ అధిపతి బహిరంగంగా మీ మీద ఆరోపణ చేశారు. అదానీకి రూ.6 వేల కోట్ల కాంట్రాక్టు ఇవ్వాలని నరేంద్రమోదీ మా రాజపక్స మీద ఒత్తిడి తెస్తున్నారని బహిరంగంగానే చెప్పారు. దాని మీద దేశ ప్రజలకు మీరు సంజాయిషీ ఇవ్వాలి, వాస్తవమా కాదా చెప్పాలి’ అని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ పూర్తి అయిన తరువాతనే దాన్ని కాపీ కొట్టి హర్ ఘర్ జల్ పెట్టిన మోదీ.. ఇప్పుడు ‘హర్ ఘర్ మే, హర్ దిల్ మే, జహర్ భర్నే కోషిష్ కర్ రహేహై’ అని మండిపడ్డారు. మోదీకి పోజులు కొట్టడం తప్ప ఏమీ రాదని ఎద్దేవాచేశారు. మిషన్ కాకతీయను చూసి అమృత్సరోవర్ను చేపట్టారని గుర్తుచేశారు. గుజరాత్కు కోకోనట్ బోర్డులు.. తెలంగాణకేమో గుండ్లు, బోడిగుండ్లు, అరగుండ్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు.
18 వేల కోట్లు ఇస్తే మీకే సీటు
మునుగోడు ఉపఎన్నిక ఒక కాంట్రాక్టర్ అహంకారం వల్లనే వచ్చిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టి.. ఆయన ద్వారా రూ.500 కోట్లు ఖర్చు పెట్టించైనా సరే.. మునుగోడు ఓటర్లను అంగడి సరుకులా కొంటామనే నరేంద్రమోదీ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని అన్నారు. జిల్లా అభివృద్ధికి, మునుగోడు అభివృద్ధి కోసం రూ.18 వేల కోట్లు కేంద్రం నిధులు ఇస్తే టీఆర్ఎస్ ఉప ఎన్నిక బరినుంచి తప్పుకొంటుందన్న మంత్రి జగదీశ్రెడ్డి ఇచ్చిన మాటకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్గా కట్టుబడి ఉంటానని సవాల్ విసిరారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రీ ఫైనల్ కూడా కాదని, అంతకుముందు జరిగే యూనిట్ టెస్ట్ లాంటిదని పోల్చారు. ‘రాజగోపాల్రెడ్డిని ఒక్కటే అడుగుతున్న.. నీకు చిత్తశుద్ధి ఉంటే.. నీకు కాంట్రాక్టు దక్కిన వైనంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. బండి సంజయ్ గుండు మీద ప్రమాణం చేయి. యాదగిరిగుట్ట ఆలయంలో మోదీ మీద ప్రమాణం చేసి, తప్పు చేయలేదని ప్రమాణం చేయి’ అంటూ సవాల్ విసిరారు.
ఫ్లోరోసిస్ సమస్యకు పరిష్కారం
మిషన్ భగీరథ ద్వారా మునుగోడులోని గ్రామాలు సహా మొత్తం వెయ్యి గ్రామాలనుంచి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేశారని మంత్రి కేటీఆర్ చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలవడానికి ఒక్క ఫ్లోరైడ్ సమస్య పరిష్కారమైందన్న అంశం చాలని తెలిపారు. మునుగోడుకు సాగునీరు అందించడానికి రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి అతి పెద్ద పారిశ్రామికవాడను దండుమల్కాపురంలో 580 ఎకరాల్లో నిర్మించామని పేర్కొన్నారు. అక్కడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటుచేశామని.. ఒకేసారి మూ డునాలుగు వేల మందికి శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇందులో మునుగోడు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. తెలంగాణలో రైతుబంధు అత్యధికంగా ఇస్తున్న నియోజకవర్గం మునుగోడు అని.. ఇక్కడ 59 వేల మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతున్నదని తెలిపారు. జాతీయస్థాయిలో చండూ రు మున్సిపాలిటీకి అవార్డు లభించిన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో 20 అత్యుత్తమ గ్రామ పంచాయతీలలో 19 మనవే ఉన్నాయని చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో 40 వేల మందికి ఆసరా పింఛన్లు, 1,100 మందికి రైతు బీమా అందిందని వెల్లడించారు. ‘ఇక్కడికి గుజరాతీ వచ్చి రాజకీయం చేయవచ్చు. ఎవరెవరో వచ్చి రాజకీయం చేయవచ్చు. కానీ తెలంగాణ వాళ్లు బయటకు పోయి రాజకీయం చేయవద్దా?’ అని మంత్రి కేటీఆర్ నిలదీశారు.
ప్రత్యర్థులు బఫూన్లు
గతంలో రాజకీయ ప్రత్యర్థులు మంచివారు ఉండేవారని, వారిని మాట అనాలన్నా వారికి ఒక స్థాయి ఉండేదని.. మాట పడ్డా ఓ పద్ధతిగా ఉండేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రత్యర్థులు వట్టి బఫూన్లుగా మారారని బండి సంజయ్ని ఉద్దేశించి ఏద్దేవా చేశారు. ‘కొట్లాట చాతకాదు, మాట్లాడ చాతకాదు, తెలంగాణకు రూపాయి తెచ్చే తెలివి లేదు. సొంత పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఆరపైసా పనిచేసిన పాపాన పోలేదు. కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నరంట ఈ బిత్తిరోడు చెప్పితే ఫర్వాలేదు. కానీ, ఆమెకు (నిర్మలాసీతారామన్) ఏమైంది, ఆమె నిర్మలమైన మనిషిలాగ ఉండే.. ఆమె కూడా ఆగమైంది’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
తంబాకు, లవంగాలు తినుకుంట
తెలంగాణ విద్యార్థులు యూనివర్సిటీల్లో వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ బఫూన్ (బండి సంజయ్) ఎక్కడన్న ఉన్నడా? అని మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు. ఆనాడు ఎక్కడో లవంగాలు, తంబాకు బుకుకుంటూ తిరిగేటోడు అంటూ ఎద్దేవాచేశారు. ‘కేసీఆర్ లేకుంటే టీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ లేకుంటే ఈ దఫా తెలంగాణ ఉద్యమం లేదు. ఆ తెలంగాణ రాకపోతే టీపీసీసీ లేదు, టీ బీజేపీ లేదు. ఊరు పేరు లేని వాళ్లు కూడా వచ్చి మన మీద మాట్లాడుతున్నరు’ అని విమర్శించారు.
వాళ్లిద్దరు ధనవంతులైతే చాలా?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అదానీ ఉన్నాడనే ధీమాతో మోదీ ఉన్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. పైసలే వాళ్ల ధైర్యమని.. ఎవరన్నా గట్టిగా టీఆర్ఎస్, కేసీఆర్లాగా మాట్లాడితే ఈడీ, ఐటీ, సీబీఐని ఉసిగొల్పుతారని చెప్పారు. అయితే జుమ్లా.. లేదంటే హమ్లా.. మోదీ చెప్పే డబుల్ ఇంజిన్ ఇదేఅని ఎద్దేవాచేశారు. అదానీ, రాజగోపాల్రెడ్డి ధనవంతులైనంత మాత్రాన దేశప్రజల భాగ్యరేఖలు మారిపోతాయా? అని నిలదీశారు. ‘మోదీ ప్రధాని అయ్యాక దేశం పేదరికంలోకి పోతున్నది. 45 ఏండ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం, 30 ఏండ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఉంటది. నిత్యావసర ధరలు ఆకాశంలో ఉంటాయి. సిలిండర్ ధర రూ.1,100 అయింది. మీరు ఎనిమిదేండ్లలో ఏం చేశారు? ప్రపంచంలో అత్యధిక పేదలున్న దేశం భారత్ అని సర్వేలు చెప్తున్నాయి. దేశంలో పేదలు ఇంకా పేదలవుతున్నారు. ఒకేఒక్కడు అదానీ మాత్రం ధనవంతుడవుతున్నాడు. ఆయన ఎవరివల్ల ధనవంతుడవుతున్నాడో తెలియదా?’ అని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
జెండా ..ఎజెండా.. అన్ని అవే
టీఆర్ఎస్ పెట్టినప్పుడు అవాకులు చవాకులు మాట్లాడారో ఇప్పుడు బీఆర్ఎస్ పెడుతున్నప్పుడు కూడా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆనాడైనా, ఈనాడైనా, మన నాయకుడు, మన జెండా, మన ఎజెండా, మన గుర్తు ఏదీ మారలేదని అయోమయానికి గురికావొద్దని స్పష్టంచేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే తెలంగాణలో చేసినట్టే దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ చేద్దామని..అవసరమైతే అందరమూ ఇతర ప్రాంతాలకు పోదామని అన్నారు. మునుగోడుకు 30 బృందాలు వెళ్తున్నాయని.. అక్కడ ఇంటింటికీ ప్రచారం చేసి భారీ మెజార్టీతో పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
కోమటిరెడ్డిలు కారు.. కోవర్టురెడ్డిలు
మిషన్ భగీరథ పనులను నీతిఅయోగ్ చూసి ప్రశంసించి ఈ పథకానికి రూ.19వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేస్తే ఇవ్వడానికి మోదీ మనసు ఒప్పుకోలేదని.. ఇప్పుడు కాంట్రాక్టర్ రాజగోపాల్రెడ్డికి రూ.18 వేల కోట్లు కాంట్రాక్టు రాసిచ్చారని కేటీఆర్ ఆరోపించారు. తమ్ముడేమో బీజేపీల చేరిండు, అన్న ఆస్ట్రేలియా పర్యటనకు పోయి ఎన్నికలు అయినంక వస్తడట, కాంగ్రెస్, బీజేపీ ఒకటే. అన్నదమ్ములిద్దరూ కోమటిరెడ్డిలు కాదు. కోవర్టురెడ్డీలు అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. టీఆర్ఎస్వీ కార్యకర్తలు ఈ విషయాన్ని ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు విడమర్చి చెప్పాలని సూచించారు.
టీఆర్ఎస్ కార్యకర్తలకు బీమా అండ
ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం
చెక్కు అందజేసిన మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యాన్ని మరోసారి కల్పించింది. గత ఆరేండ్లుగా కార్యకర్తల కోసం ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించిన టీఆర్ఎస్, ఈ ఏడాది సైతం ఏడోసారి ప్రమాద బీమా ప్రీమియాన్ని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించింది. బీమా కంపెనీకి ప్రమాద బీమా కోసం ప్రీమియం చెకును మంగళవారం హైదరాబాద్లో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అందజేశారు. ఏడేండ్లలో సుమారు రూ.66 కోట్ల బీమా ప్రీమియంను టీఆర్ఎస్ చెల్లించింది. ఈ బీమా సౌకర్యంతో అకస్మాత్తుగా వివిధ ప్రమాదాల్లో చనిపోయిన 4 వేల మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భరోసానిచ్చింది. 70 ఏండ్లలోపు ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ఈ ప్రమాద బీమా సౌకర్యం లభిస్తుంది. ఏదైనా ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణం సంభవిస్తే రూ.2 లక్షలు, పూర్తిగా వికలాంగులు అయితే రూ.లక్ష, పాక్షికంగా వికలాంగులైతే రూ.50 వేల బీ మా భరోసా అందుతుంది. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, పార్టీ బీమా వ్యవహారాల ఇంచార్జి, ప్రధాన కార్యదర్శి సోమ భరత్ గుప్తాలు పాల్గొన్నారు.
విద్యార్థి నాయకులకు ప్రోత్సాహం
టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో జై తెలంగాణ అంటే నక్సల్స్గా ముద్ర వేసే వారని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో ఎన్కౌంటర్లు లేని తెలంగాణగా మారిందని చెప్పారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్తున్నదని, విద్యార్థి నేతలను ప్రోత్సహించి పదవులు ఇచ్చిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని కొనియాడారు. తనతోపాటు చాలామంది విద్యార్థులకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా టీఆర్ఎస్ అవకాశం ఇచ్చిందని గుర్తుచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువతకు అన్యాయం చేస్తున్నదని చెప్పారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్కుమార్, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, బాలరాజు యాదవ్, వాసుదేవ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టీఆర్ఎస్వీ నేతలు కే కిశోర్గౌడ్, పల్లా ప్రవీణ్రెడ్డి, తుంగ బాలు, పెరికె శ్యాం, పడాల సతీశ్ పాల్గొన్నారు.