హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : రైతన్నలు ఆత్మహత్య చేసుకొని కుటుంబాలను ఆగం చేయొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సిరికొండ మండలం పొన్న గ్రామంలో జొన్నల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మనస్తాపం చెంది మార్కెట్ యార్డులోనే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకొన్న ఆదర్శ రైతు పాండురంగ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని శనివారం ఆయన పరామర్శించారు. పాండురంగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. రైతు ఆత్మహత్యలకు గల కారణాలు తెలుసుకొన్నారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున రూ.3 లక్షల చెక్కు అందజేశారు. రైతు చనిపోయి ఐదు రోజులైనా జొన్న కుప్ప ఇంకా మార్కెట్ యార్డులోనే ఉన్నదని, రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో పాండురంగ్ కూతురు శిరీష చెబుతుంటే కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
రైతుబంధు ఇవ్వకున్నా, కరెంటు ఇవ్వకున్నా ఏ సాయం చేయకున్నా రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే జొన్నలకు రూ.3,720 మద్దతు ధర చెల్లించడం లేదని మండిపడ్డారు. మ్యానిఫెస్టోలో మద్దతు ధరతో పాటు ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇస్తాం, జొన్నలకు క్వింటాకు రూ.3720తోపాటు మీద నుంచి రూ.500 కలిపి రూ.4200 ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాకు రూ.2వేలకు అమ్ముకొనే దుస్థితిని తీసుకొచ్చిందని నిప్పులు చెరిగారు. రూ.లక్షకు పైగా లోన్ ఉంటే రుణమాఫీ కాలేదని, రైతుబంధు కూడా పడలేదని పాండురంగ్ భార్య చెప్పారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న పిల్లలు ఉన్న పాండురంగ్ వంటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పిల్లలు రోడ్డున పడే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం రైతుబీమా ప్రీమియం కట్టకపోవడంతో రూ.7 వేల క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ‘పాండురంగ్ కుటుంబానికి న్యాయం చేసేవరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. ముగ్గురు పిల్లలు ఉన్నారు. చదువుకుంటున్నారు. నేను ఆ కుటుంబానికి మాట ఇచ్చా. ప్రభుత్వం మొడలు వంచైనా సరే మీకు పరిహారం ఇప్పిస్తామని చెప్పాం. ప్రభుత్వం పాండురంగ్తో కుటుంబానికి రూ.25 లక్షలు ఇచ్చి తీరాల్సిందే’ అని స్పష్టంచేశారు.