Minister KTR : గ్రేటర్ వరంగల్కు మరో 250 కోట్ల ప్రత్యేక నిధులు ఇస్తామని, ఈ 250 కోట్ల నిధులతో నగర ప్రజలకు తక్షణ ఉపశమనం లభించే అత్యంత కీలకమైన మౌలిక వసతులను కల్పిస్తామని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు(Minister KTR) అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(Greater Warangal Municipal Corporation) పైన శాసనసభ కాన్ఫరెన్స్ హాల్లో కేటీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
వరంగల్ నగరానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల పైన మంత్రి సమీక్ష జరిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ పనుల పురోగతి వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరానికి ఇప్పుటికే ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇచ్చి నగర అభివృద్ధి కోసం మద్దతు అందిస్తుందని తెలిపిన కేటీఆర్ వీటికి అదనంగా టి యు ఎఫ్ ఐ డి సి ద్వారా మరో 250 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను వెంటనే విడుదల చేస్తామని ప్రకటించారు.
నగరంలో ఈ మధ్య వచ్చిన వరద సమస్య(Flood Problem) పైన ప్రత్యేకంగా సమావేశంలో చర్చించిన కేటీఆర్ భవిష్యత్తులో ఇలాంటి వరదలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపైన… దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వరద నివారణలో భాగంగా నాలాల అభివృద్ధి… నాలాల పైన ఉన్న అడ్డంకుల తొలగింపును వెంటనే చేపట్టాలని కోరారు. నాలాలపై కబ్జాలను వెంటనే తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాలని… ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలు ఒత్తిడిలకు తలగవద్దని అధికారులకు కేటీఆర్ ఆదేశించారు. కబ్జాల తొలగింపు విషయంలో పేద ప్రజలను ఒప్పించి, వేగంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించారు. వరదల కారణంగా భవిష్యత్తులో ప్రాణ నష్టం జరగకుండా చూడడం కోసమే ఈ కార్యక్రమం తీసుకుంటున్నట్లు వారికి తెలియజేయాలని కేటీఆర్ చెప్పారు.
ఈ సందర్భంగా వరంగల్ వరదలను అరికట్టేందుకు హైదరాబాదు నగరంలో ఏర్పాటుచేసిన ఎస్ ఎన్ డి పి కార్యక్రమం మాదిరి ఒక ప్రత్యేక కార్యచరణ తీసుకోవాలని నగర ప్రజాప్రతినిధులు మంత్రిని కోరారు. హైదరాబాద్లో చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా…. గతంలో మాదిరే ఈసారి కూడా అదే స్థాయిలో వర్షం పడినా… హైదరాబాద్ ప్రజలకు వరదల నుంచి ఎంతో ఉపశమనం కలిగిందని… ఇదే తీరుగా వరంగల్ నగరానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ వెంటనే ఇలాంటి ఒక ప్రత్యేక నాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని పురపాలక శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఒకదాన్ని ఏర్పాటు చేసి అవసరమైన కార్యాచరణను చేయాలని పురపాలక శాఖ ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశాలు ఇచ్చారు.
వరంగల్ నగరంలో సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న కాళోజీ ఆడిటోరియం(kaloji auditorium) వంటి అభివృద్ధి పనులలో జరుగుతున్న జాప్యం పైన కూడా మంత్రి కేటీఆర్ స్పందించారు. వీటిని వెంటనే పూర్తి చేసేందుకు అవసరమైతే ఎక్కువ సిబ్బందిని పెట్టి, అధిక షిఫ్టుల్లో పనిచేస్తూ ముందుకు వెళ్లాలని… ఈ కార్యక్రమాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చూసుకుంటుందన్న మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.