KTR | పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్కు ఆపాదించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారని అన్నారు.
పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్లు తప్పవని బెదిరిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్టులను ఎన్నో చూసిందని కేటీఆర్ తెలిపారు. ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామని తెలిపారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.