KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న కుట్రను ప్రజలకు చెప్పే బాధ్యత తమపై ఉన్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దురదృష్టవశాత్తు మేడిగడ్డ పియర్లకు నవంబర్ మాసంలో పగుళ్లు వచ్చాయి. ఇదేం మొదటిసారి కాదు. చరిత్రలో ఎన్నడూ జరగంది.. మొదటిసారి జరిగింది కాదు. పశ్చిమ బెంగాల్లో ఫరక్క బారేజీ నిర్మాణం ఉండగానే కూలిపోయింది. తర్వాత పునర్నిర్మాణం చేశారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కడెం ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ నాడు కొట్టుకుపోయింది. ములుగు జిల్లా గుండ్లవాగు ప్రాజెక్టు కట్టారు. 2006-2007 రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా పునాది రాయి వేస్తే.. ఆ రోజు సంవత్సరంలోనే రెండుసార్లు కొట్టుకుపోయింది’ అని గుర్తు చేశారు.
‘ఈ రోజు మంత్రిగా ఉన్న సీతక్క.. ఆ రోజు వరంగల్ నుంచి గుండ్లవాగు ప్రాజెక్టు దాకా పాదయాత్రలు చేసి నానా రాద్ధాంతం చేసిన మాట వాస్తవం కాదా? మూసీ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోలేదా? పులిచింతలలో సమస్యలు రాలేదా? ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరంలో సమస్యలు రాలేదా? దేశంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టినప్పుడు సమస్యలు వస్తే.. ఎట్లా పరిష్కరించలనే ఓర్పు నేర్పుండాలి. 1950 దశంలో కడెం ప్రాజెక్టు మొదటి వరదకే కొట్టుకుపోయింది. గతేడాది వరదతో కొట్టుకుపోయినంత పనైంది. కాని మేం ఎవరినీ నిందించలేదు. ప్రాజెక్టు కట్టిన వాళ్లదేనని. దేవాదుల పైపులైన్లు గూడెం లిఫ్ట్ మోటార్ల ఆన్ చేస్తే పటాక్కులా పేలిపోయాయి. ఒక్కసారి కాదు.. నాలుగైదుసార్లు జరిగింది. కానీ, అప్పటి ప్రభుత్వం పునరుద్ధరించింది. దేవాదుల టన్నెల్ కూలిపోయింది. మా ప్రభుత్వం వచ్చాక టన్నెల్ వచ్చాక పునరుద్ధరించేందుకు ప్రయత్నంచేశాం. సాధ్యం కాదు.. రామప్పకు ముప్పు వస్తుందంటే ప్రత్యామ్నాయంగా టన్నెల్ను వదిలేసి.. పైప్లైన్ నిర్మాణం చేశాం. మూసీ గేట్లు కొట్టుకుపోయినయ్. దామోదర రాజనరసింహ జిల్లాలోని సింగూరు డ్యామ్ కొట్టుకుపోయింది’ అని గుర్తు చేశారు.
‘నిజామాబాద్ జిల్లా కౌలాస్ నలా మట్టికట్ట కొట్టుకుపోయింది. వరంగల్ జిల్లాలో పాలెంవాగు కడితే రెండుసార్లు మట్టి కట్ట కొట్టుకుపోలేదా? గుజరాత్లో మచ్చు డ్యామ్ కూలిపోతే 2వేల మంది చనిపోయారు. కడప జిల్లాలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి డ్యామ్ను 2005-06లో తొలిసారిగా నింపారు. 2022లో లీకేజీ వచ్చింది. దాన్ని రిపేర్ చేసి నడుపుతున్నరు. పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతింటే రిపేర్ చేస్తున్నరు. ఇలా ఎన్నో ఉన్నయ్. మేడిగడ్డలో చిన్న ప్రమాదం జరిగింది. కాఫర్ డ్యామ్ కట్టి రిపేర్ చేయొచ్చు. 84 పియర్లు ఉండే మేడిగడ్డలో ఒక బ్లాక్లో ప్రమాదం జరిగితే.. అక్కడికి నీరు రాకుండా చేసి మరమ్మతులు చేయవచ్చు. రెండు నెలల్లో పనులు పూర్తి చేయచ్చు. రాబోయే వర్షాకాలం వరకు పనులు పూర్తి చేయవచ్చు. జరగకూడదని ఏదో జరిగిందని.. శ్వేతపత్రమని.. నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ ఏ బరాజ్లో సమస్య వచ్చినా అక్కడ మరమ్మతులు జరిపించడం.. విచారణ చేయడం.. తప్పులుంటే చర్యలు తీసుకోవడం సాధారణంగా ఏ ప్రభుత్వమైనా చేయాల్సిన పని’ అన్నారు.
‘మేడిగడ్డలో జరిగిందానిపై మేం కోరుతున్నాం. ప్రభుత్వం విచారణ జరపాలి. జ్యుడీషియల్ కమిషన్ అన్నారు.. కమిటీ అన్నారు.. దాన్ని వ్యతిరేకించడం లేదు. విచారణ జరిపించాలి.. బాధ్యులపై చర్యలు తీసుకోండి మాకు అభ్యంతరం లేదు. గోదావరిలో అత్యధికంగా వచ్చింది గత సంవత్సరం. దాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. తర్వాత మేయింటనెన్స్ లోపించడమే.. దేనివల్లనో నష్టం జరిగింది. ఎలా జరిగిందో విచారణలో తేలుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేం డిమాండ్ చేసేది ఒక్కటే. రాజకీయ వైరుధ్యాలు, పంథాలు ఎన్ని ఉన్నా రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు మనందరికీ ముఖ్యం. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిది.. డిమాండ్ చేసేది.
వెంటనే కాపర్ డ్యామ్ నిర్మించి మరమ్మతులు చేయాలి. వీలైనంత త్వరగా ఒక పంపైనా ఆన్ చేసి నీరివ్వాలి. మాకున్న సమాచారం ప్రకారం.. అధికారులు రైతులకు చెబుతున్నరు. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో మంచినీళ్లకే గోస ఉంటుంది.. పంటలకు నీరెక్కడ ఇస్తమని చెబుతున్నరంట. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయ పంచాయితీలు పెట్టండి.. మమ్మల్ని బద్నాం చేయండి.. కోపం ఉంటే తీర్చుకోండి. అభ్యంతరం లేదు. మాపై కోపం రైతులపై తీయకండి. మాపై కోపం రాష్ట్రంపై తీయకండి. చేయాల్సిన పనులు చేయకుండా శ్వేతపత్రాలు.. పవర్ పాయింట్స్, ప్రాజెక్టు విజిట్లు దుమ్మెత్తిపోసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నరో మంచిది కాదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.