Congress | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అధికార బీజేపీని ఇరుకున పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని బూచిగా వాడుకుంటున్నది. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్న అదానీపై పలు కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెల్సిందే. వీటిపై పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు ఇప్పటికే అనేక కథనాలను ప్రచురించాయి. అదానీ అక్రమ సంపాదనకు ప్రియ మిత్రుడు ప్రధాని మోదీ, ఆయన పరివారం అండదండలందించారంటూ గత కొన్నేండ్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు దుమ్మెత్తిసోస్తున్నారు. దేశంలో ప్రజల కష్టాల కడగండ్లకు మోదానీలే (అదానీ+మోదీ) కారణమని ఆరోపిస్తూ.. పలు ఎన్నికలలో ప్రచారాస్త్రంగా కూడా వాడుకున్నారు. ఈ ప్రయత్నంలో కొన్ని విజయాలను కూడా అందుకున్నారు.
తాజాగా తమ పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తమ బద్ధ శత్రువైన అదానీతో దోస్తీకి దిగటం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని సంకటంలో పడేసింది. మోదీ సహకారంతో విస్తరిస్తున్న అదానీ వ్యాపార సామ్రాజ్యం వల్ల దేశమంతా నష్టపోతున్నదని కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతుండగా, అదే పార్టీకి చెందిన రేవంత్రెడ్డి మాత్రం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎర్రతివాచీ వేయడం ఆ పార్టీ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ చందంగా మారింది. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా గౌతమ్ అదానీతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకుముందు రేవంత్రెడ్డి ఆహ్వానంపైనే ఈ నెల 3న అదానీ కొడుకు కరణ్ అదానీ హైదరాబాద్ వచ్చి తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలపై చర్చించారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పెద్దలు దిక్కుతోచని స్థితికి నెట్టివేయబడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలవడం.. ఆ తరువాత అదానీని పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడంపై కాంగ్రెస్ పెద్దలు సమాధానం చెప్పుకోలేని స్థితికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు పీ చిదంబరం గురువారం ఢిల్లీలో తమ కమిటీ గురించి వివరించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఒకవైపు దేశ సంపదను ప్రధాని మోదీ తన ప్రియ మిత్రుడు అదానీకి దోచిపెడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తుంటారు. మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ప్రభుత్వం దావోస్లో అదానీతో ఒప్పందం కుదుర్చుకోవడం ఏమిటి?’ అంటూ ఓ పాత్రికేయుడు చిదంబరాన్ని ప్రశ్నించారు.
దీనికి ఆయన సమాధానం చెప్పకపోగా, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ముందున్న మైక్ను పక్కనున్న పార్టీ నాయకురాలు సుప్రియా శ్రీనాథే వైపు తోసేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె కూడా మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, తమ మ్యానిఫెస్టోకు సంబంధించింది ఏదైనా అడగాలంటూ దాటవేయడం వారి అగమ్యగోచరస్థితికి అద్దం పట్టింది. ఇప్పుడీ అంశం కాంగ్రెస్ వర్గాలలోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. రేవంత్రెడ్డి వైఖరి కాంగ్రెస్ అగ్రనేతలను తీవ్ర ఇరకాటంలో పడేసిందనడానికి పార్టీ కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ప్రెస్మీట్లో కనబరిచిన అసహనమే అద్దం పడుతోందంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. మోదీ+ అదానీ= మోదానీ అన్న పోస్ట్ వైరల్ అయిన మాదిరిగా తాజాగా కొందరు రేవంత్ + అదానీ = రేవాని అంటూ పోస్టులు పెడుతున్నారు.