రామాయంపేట/చేగుంట, జూలై 16: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం జగిత్యాల పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ తిరిగి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో కళ్లెదుటే రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన ఆయన క్షతగాత్రులను తన కాన్వాయ్లోని ఓ వాహనంలో దవాఖానకు తరలించారు. వివరాలిలా.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన షేక్ సల్మాన్ డ్రైవర్ మహమ్మద్ జమీరొద్దీన్తో కలిసి కారులో హైదరాబాద్కు వెళ్తున్నారు.
మెదక్ జిల్లా చేగుంట జాతీయ రహదారి బైపాస్ వద్దకు రాగానే రామాయంపేట నుంచి చేగుంటకు వెళ్తున్న రాణిగంజ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో మంత్రి కేటీఆర్ జగిత్యాల నుంచి నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ వెళ్తున్నారు. కళ్లెదుటే ప్రమాదం జరగడంతో మంత్రి వెంటనే కాన్వాయ్ ఆపి కారు దిగి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. స్వయంగా నీళ్లు తాగించి, తన కాన్వాయ్లోని ఓ వాహనంలో తూప్రాన్లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించాలని అధికారులను ఆదేశించి, హైదరాబాద్కు బయలుదేరారు. మంత్రి కేటీఆర్ చొరవకు అక్కడున్న వారు ధన్యవాదాలు తెలిపారు.