హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘ఎవరెక్కువ రేటు ఇస్తారు? ఎవరెక్కువ డబ్బు ఇస్తారు? ఇలా పద్ధతి ప్రకారం డబ్బులు తీసుకుంటూ కాంగ్రెస్లో టికెట్లు అమ్ముకుంటున్నారు’ అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం ప్రగతిభవన్లో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన.. ఇటీవల తనను కలిసిన కాంగ్రెస్ నాయకుడు చెప్పిన విషయాన్ని మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. ‘కూకట్పల్లిలో పోటీ చేయాలంటే రూ.15 కోట్లు ఇవ్వాలని ఓ కాంగ్రెస్ నేతను అడిగారు. దీనికి అదనంగా మరో రూ.10 కోట్లు ఖర్చు పెట్టుకోవాలని చెప్పారు. అది గెలిచే సీటు కాదు. ఇంతకుముందు పనిచేసిన సీటూ కాదు. కానీ ఆ ఆఫర్ ఇచ్చారు’ అని తెలిపారు. అది సొంత ప్రాంతం కూడా కాదు కదా అని తాను అడగ్గా.. ‘కాంగ్రెస్లో అవన్నీ ఉండవ్ సార్.
డబ్బు ఇచ్చేస్తే కావాల్సిన సీటు ఇచ్చేస్తరు. పైగా ఒక ముఖ్యమైన స్థానం నుంచి పోటీచేస్తే నాకు గుర్తింపు వస్తుంది. అందుకే ఆశతో పోతున్నా’ అని ఆ నేత తనతో అన్నట్టు కేటీఆర్ చెప్పారు. ఆ పార్టీలో నోట్ల కట్టలతో రాజకీయం చేస్తున్నారని తెలిపారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్ కలెక్షన్లను ప్రారంభించింది. మొన్నటివరకు అక్కడ ఉన్నది 40 శాతం కమీషన్ల ప్రభుత్వం అన్నారు. కానీ ఇప్పుడు 50 శాతం కమీషన్ గవర్నమెంట్ వచ్చింది. స్కాంగ్రెస్.. స్కాంలనిండా కూరుకుపోయింది. అక్కడ ప్రతి చదరపు అడుగుకు రూ.500 చార్జ్ చేస్తున్నారు. అక్కడ ఈ రోజు ఓ సామాన్య కార్పొరేటర్ ఇంట్లో(ఆ కార్పొరేట్ భర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు) రూ.42 కోట్లు దొరికాయి. మాకున్న సమాచారం మేరకు ఇందులో ఇప్పటికే రూ.8 కోట్లు కొడంగల్కు, రేవంత్రెడ్డికి చేరాయి. కాంగ్రెస్ పార్టీ అనేది ట్రైడ్, టెస్టెడ్, డస్టెడ్ పార్టీ’ అని వెల్లడించారు.