హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ)/ వ్యవసాయ వర్సిటీ: దేశంలో ప్రతి గ్రామానికి నర్సరీ, పార్కు, వైకుంఠధామం, ట్రాక్టర్, ట్రాలీ, ప్రతి ఇంటి ముందు చెట్లు, ప్రతి ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. పల్లెల్లో ఇంతటి అభివృద్ధి మరే రాష్ట్రంలోనైనా చూపించగలరా? అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు పరిపాలించే రాష్ట్రాలు దేశంలో 20 వరకు ఉన్నాయని, వాటిల్లో ఎక్కడైనా తెలంగాణ పల్లెల్లాంటి అభివృద్ధి చూపించగలరా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు గ్రామాల అభివృద్ధికి రూ.14,235 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. శుక్రవారం రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ పంచాయితీలకు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, సీహెచ్ మల్లారెడ్డి అవార్డులు ప్రధానం చేశారు. 47 గ్రామ పంచాయతీలు అవార్డులు గెలుచుకొన్నాయి. ఈ సందర్భంగా పల్లె ప్రగతిపై రూపొందించిన పుస్తకాన్ని మంత్రులు ఆవిషరించారు.
తెలంగాణలో అన్నిరంగాలు సమాన స్థాయిలో అభివృద్ధి సాధిస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘పరిశ్రమలు వస్తున్నాయి. పర్యావరణం బాగున్నది. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి జరుగుతున్నది. అన్నింటి సమతుల్యత జరుగుతున్నది. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నది. సంక్షేమం కూడా కొనసాగుతున్నది. వ్యవసాయ విస్తరణ జరుగుతున్నది. ఐటీ ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. ఇంతటి సమతుల్య ఆర్థిక వ్యవస్థ ఉన్నది కాబట్టే 9 సంవత్సరాల్లో అద్భుతాలు జరిగాయి. ప్రధాని మోదీకి ఇష్టం లేకపోయినా అవార్డులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది’ అని పేర్కొన్నారు. సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులందరి సమిష్టి కృషి, సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు తెలంగాణకు 79 అవార్డులు వచ్చాయని చెప్పారు. ‘రూర్బన్లో దేశంలో రెండో స్థానంలో ఉన్నాం. సాగిలో టాప్ 20 గ్రామాల్లో 19 తెలంగాణవే ఉన్నాయి’ అని తెలిపారు. తక్షణమే పల్లె ప్రగతి, నరేగా కింద రూ.1300 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఫ్రీజింగ్లో ఉన్న రూ.250 కోట్లు కూడా విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి, అధికారులతో మాట్లాడుతానని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధికి పెరిగిన భూముల రేట్లే నిదర్శనమని అన్నారు. ‘రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంటలో మా తాతకు చెందిన భూమిని గతంలో ఇతరులు కొనుక్కొన్నారు. దానిని తిరిగి కొనుక్కుందామని ప్రయత్నిస్తే ఎకరం రూ.30 లక్షలని చెప్పారు. ఎక్కడో మారుమూలన ఉన్న ఆ భూమి రేటు చూసి నాకు చక్కర్ వచ్చినంత పనైంది. ప్రభుత్వ పనితీరుకు భూముల ధరలకు సంబంధం లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 వరకు భూముల రేట్లు ఎందుకు పెరగలేదు? సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వమే భూముల రేట్లు పెరగడానికి కారణం’ అని స్పష్టంచేశారు.
గ్రామ పంచాయతీలకు అవార్డులు రావడానికి గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శులతోపాటు ప్రజలు, పాలకవర్గం ఎంతో కృషి చేశారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ‘అవార్డులు వచ్చిన గ్రామాలను ప్రోత్సహించాలి. కాబట్టి జిల్లా స్థాయిలో అవార్డులు సాధించిన గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున, రాష్ట్ర స్థాయి అవార్డు సాధించిన గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున, జాతీయ స్థాయి అవార్డు సాధించిన పంచాయతీలకు రూ.30 లక్షల చొప్పున అదనపు నిధులు ఇస్తాం’ అని ప్రకటించారు. గతంలో మూడునాలుగు గ్రామాలకు ఒక పంచాయతీ కార్యదర్శి ఉండేవారని, కానీ సీఎం కేసీఆర్ ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించారని చెప్పారు.
రాష్ట్ర ఏర్పాటుతోనే వికేంద్రీకరణ ఆగలేదని, 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘గతంలో 62 మున్సిపాలిటీలు ఉండేవి. ఇప్పుడు 142 మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకొన్నాం. కొత్తగా 3,400 పైగా గ్రామ పంచాయితీలు ఏర్పాటు చేసుకోవడంతో రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు అయ్యాయి. ప్రతి జిల్లాకు స్థానిక సంస్థల పర్యవేక్షణ కోసం అదనపు కలెక్టర్లను నియమించాం. వికేంద్రీకరణ వల్ల వేగంగా పనులు జరుగుతున్నాయి. గ్రామీణాభివృద్ధిలో దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నాం. నేను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ-పంచాయతీ అని స్టార్ట్ చేశాం. అయితే ఇంకా అన్ని గ్రామ పంచాయతీల్లో కంప్యూటర్లు లేవని అధికారులు చెప్తున్నారు. త్వరలోనే ప్రతి గ్రామ పంచాయతీకి కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ను సరఫరా చేస్తాం. వీటి కోసం రూ.60-70 కోట్లు వెచ్చిస్తాం’ అని కేటీఆర్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిధులివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నా రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. గతంలో గ్రామ పంచాయతీలు ఎలా ఉండేవో ఒక్కసారి ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ‘గతంలో గ్రామాల్లో నీళ్లకు ఎన్ని కష్టాలు ఉండేవి! ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధి చేసిన నీటిని నల్లా ద్వారా అందిస్తున్నాం. గతంలో ఎమ్మెల్యేలు గ్రామాలకు పోతే ఖాళీ బిందెలతో ప్రజలు ఎదురుగా వచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. గతంలో ఎవరూ చేయని పనులు గ్రామాల్లో ఇప్పుడున్న సర్పంచ్ల ద్వారా అవుతున్నాయి. 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన రూ.600 కోట్ల నిధులను కేంద్రం ఆపేసింది. అవార్డులు ఇస్తున్న కేంద్రం, నిధులు మాత్రం ఇవ్వడంలేదు. రైతులు కల్లాలు నిర్మిస్తే వద్దని అంటున్నది. అదే గుజరాత్లో చేపలకు కల్లాలు కడుతుంటే నిధులు ఇస్తున్నది’ అని విమర్శించారు.
దేశంలో చరిత్ర అంటే మన తెలంగాణ రాష్ట్రానిదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో ఎన్నడూ మనకు అవార్డులు రాలేదని, ఇప్పుడు ఏ అవార్డు ఇచ్చినా తెలంగాణ రాష్ట్రానికే వస్తున్నదని పేర్కొన్నారు. వీటన్నింటికి సీఎం కేసీఆర్ కృషే కారణమని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, వివిధ జిల్లాల జడ్పీ చైర్పర్సన్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తున్నదని, కష్టపడి పనిచేసేవాళ్లకే మళ్లీ అధికారం ఇవ్వాలని ప్రజలను మంత్రి కేటీఆర్ కోరారు. గ్రామాల అభివృద్ధికి కొన్నేండ్లలోనే రూ.14,235 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదని స్పష్టంచేశారు. మంచి పనిచేసే ప్రభుత్వాలను, సర్పంచ్లను, ప్రజాప్రతినిధులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేశామనేదే ముఖ్యమని ప్రజాప్రతినిధులకు సూచించారు.
పల్లెల గురించి సీఎం కేసీఆర్కు తెలిసినంతగా దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదని మంత్రి కేటీఆర్ అన్నారు. పల్లెలకు ఏం కావాలి, ఏ అవసరాలు ఉన్నాయో సీఎంకు బాగా తెలుసని, సర్పంచ్ కంటే ఎకువగా కేసీఆర్ ఆలోచిస్తారని చెప్పారు. కేసీఆర్ తొలిసారి ఎమ్మెల్యే అయిన తరువాత ఎమ్మెల్యేకు ఎలాంటి అధికారాలు, బాధ్యతలు, విధులు ఉంటాయో తెలుసుకొనేందుకు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణ తీసుకొన్నారని తెలిపారు. తొలిసారి గెలిచిన ప్రజాప్రతినిధులకు తమ విధులపై పూర్తి అవగాహన ఉండట్లేదని, దేశంలో ఐదంచెల పాలన వ్యవస్థ ఉన్నదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో, అవినీతిలో చివరి స్థానంలో ఉన్నదని కేంద్రప్రభుత్వంతోపాటు అనేక సంస్థల సర్వేలు చెప్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. 13 రాష్ట్రాల్లో అవినీతిపై ఓ సంస్థ సర్వే చేస్తే తెలంగాణలోనే అత్యంత తకువ అవినీతి ఉన్నదని తేలిందని చెప్పారు. 2015లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు ఉంటే ప్రస్తుతం రూ.3.17 లక్షలకు అంటే 300 శాతం పెరిగిందని తెలిపారు. ‘ప్రతిపక్ష నాయకులు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఒర్రుతారు. నరం లేని నాలుక కాబట్టి ఎలాగైనా ఒర్రాలి కాబట్టి ఒర్రుతున్నారు. వారు వాస్తవాలు తెలుసుకోవాలి’ అని సూచించారు.