హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతున్నదన్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బుధవారం డీజీపీ అంజనీకుమార్తో ఫోన్లో మాట్లాడారు. ఈటలకు అవసరమైన భద్రత కల్పించాలని ఆదేశించారు. ఆ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడిన డీజీపీ వారి నుంచి కొంత సమాచారాన్ని తెప్పించుకున్నట్టు తెలుస్తున్నది. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు డీసీపీ సందీప్రావును హుజూరాబాద్కు పంపినట్టు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో హత్యారాజకీయాలకు తావులేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు మొదలు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఈటల రాజేందర్కు భద్రత విషయంలో రాజీ పడబోమని స్పష్టంచేశారు. ఈటల ఆరోపణలపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.
పౌరుల రక్షణ బాధ్యత మాదే
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ రాజీలేకుండా నిరంతరం కృషి చేస్తున్నదని డీజీపీ తెలిపారు. ప్రజాప్రతినిధులు మాత్రమే కాదని పౌరుల రక్షణ బాధ్యత కూడా తమదేనని స్పష్టం చేశారు. గత లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి రాష్ట్ర పోలీసులు అవార్డులు కూడా అందుకున్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యవస్థీకృత నేరాలు పూర్తిగా తగ్గాయని, రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు చోటులేదని పునరుద్ఘాటించారు.
ఈటల ఇంటికి డీసీపీ
హుజూరాబాద్లోని ఈటల ఇంటికి వెళ్లిన డీసీపీ సందీప్రావు ఆయనను కలువలేకపోయారు. తన భర్త హైదరాబాద్ వెళ్లారని ఈటల భార్య జమున డీసీపీకి తెలిపారు. దీంతో కొద్దిసేపు అక్కడే ఎదురుచూసిన డీసీపీ ఈటలను కలువకుండానే హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. కాగా, డీసీపీ గురువారం ఈటలను హైదరాబాద్లో కలిసే అవకాశం ఉంది.