రాజన్న సిరిసిల్ల, మే 4 (నమస్తే తెలంగాణ): జిల్లాలను యథాతథంగా కొనసాగించకుంటే ఉద్యమం తప్పదని, దీనికి బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన జిల్లాలను అలాగే కొనసాగించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర ధరలు పెంచేసిన ‘పిర’మైన మోదీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సిరిసిల్ల పట్టణంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా కేటీఆర్ విస్తృత ప్రచారం చేశారు. వెంకంపేట చౌరస్తాలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
అనంతరం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేతన్నలపై తమ వైఖరేంటో ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి సీఎం అయ్యాక గోదావరిలో నీళ్లు మాయమయ్యాయని, సిరిసిల్లలో బోర్లు ఎత్తిపోతున్నాయని, ప్రజలు గొంతెండి నీళ్ల కోసం అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల పంటలు ఎండిపోతున్నా సీఎం ఒక్కమాట కూడా మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిగ్గుమాలిన ప్రభుత్వం, తుగ్లక్ పాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ, తులం బంగారం, రూ. 4 వేల పెన్షన్, స్కూటీలు ఇస్తానని చెప్పి పొంకనాల పోతిరెడ్డిలా డైలాగులు కొట్టారని ధ్వజమెత్తారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు చేశామని, ఇప్పుడేమో పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 17 జిల్లాలే ఉండాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అదే జరిగితే ఏ జిల్లాలు ఉంచుతారో, వేటిని తొలగిస్తారో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఉన్నాయని, వీటిలో దేనిని తీసేస్తారని ప్రశ్నించారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో నిజామాబాద్, జగిత్యాలలో ఏ జిల్లాను ఉంచుతారని నిలదీశారు.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయని, వీటిలో దేనిని తీసేస్తారని, అదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో దేనిని ఎత్తేస్తారో దమ్ముంటే ప్రజలకు చెప్పాలని సవాలు విసిరారు. తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. ఊసరవెల్లి రంగులు మారిస్తే రేవంత్రెడ్డి తేదీలు మారుస్తున్నారని దుమ్మెత్తిపోశారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో అధికారులు ప్రజలకు చేరువయ్యారని, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. ‘నా తప్పు నేను తెలుసుకున్నా.. నాకు బుద్ధి వచ్చింది. చెంపలేసుకుంటున్నా.. జిల్లాలను యథాతథంగా కొనసాగిస్తున్నా’ అని సిరిసిల్ల సభలో సీఎం చెప్తాడని ప్రజలు భావించారని పేర్కొన్నారు.
కేసీఆర్ ఏం చేస్తే దానికి ఉల్టా చెయ్యాలని రేవంత్రెడ్డి లక్ష్యంగాపెట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ రూ. 3వేలకోట్ల విలువైన బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల నేతన్నల బతుకులు నిలబెట్టారని కేటీఆర్ ప్రశసించారు. నేత కార్మికులు నెలకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేలు సంపాదించుకుంటూ గౌరవప్రదంగా జీవించారని పేర్కొన్నారు. రేవంత్ వచ్చాక రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, బతుకమ్మ చీరలు కట్ చేశారని ఆగ్రహం మండిపడ్డారు.
హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తే దానికి కనీసం దండ వేసి నివాళులు అర్పించకుండా తాళం వేసి చెరలో బంధించిన మూర్ఖుడు సీఎం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ విధానాలతో తిరిగి సిరిసిల్లలో నేతన్నల ఆత్యహత్యలు ప్రారంభమయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వం బతుకమ్మ చీరలకు రూ. 3 వేల కోట్ల ఆర్డర్లు ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే రూ. 6వేల కోట్ల ఆర్డర్లతో చీరలు తయారు చేయించాలని సవాలు విసిరారు. సమావేశంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరాలని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను గతంలో తానే ఆహ్వానించానని కేటీఆర్ తెలిపారు. అప్పుడు సున్నితంగా తిరస్కరించిన ఆయన ఆ తర్వాత తన కోరిక మేరకు పొత్తుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. కవిత అరెస్ట్ తర్వాత బీఎస్పీ నేతల నుంచి ఒత్తిడి పెరగడంతో బీఆర్ఎస్లో చేరారని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగలేదని తెలిపారు. పార్టీలో అన్ని పదవులు అనుభవించిన కేశవరావు, కడియం శ్రీహరి, రంజిత్రెడ్డి, మహేందర్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి అధికారం పోగానే పార్టీలు మారారని, అలాంటిది అధికారంలో లేకున్నా మాట ప్రకారం ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరడం గొప్ప విషయమని కేటీఆర్ ప్రశంసించారు.
కష్టకాలంలో బీఆర్ఎస్లో చేరి అండగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్తో ఉన్న బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపిస్తే పార్లమెంట్కు, బీఆర్ఎస్కు, మనకు గౌరవం పెరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. దేశం సుభిక్షంగా, ప్రశాంతంగా ఉండాలని, సుపరిపాలన, సమపాలన అందించాలనే ఉద్దేశంతో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రెండు జాతీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) రద్దు చేసే ప్రమాదమున్నదని హెచ్చరించారు. 35 పార్టీలను ఒప్పించి, తెలంగాణ సాధించిన కేసీఆర్తోనే దీనిని ఆపడం సాధ్యమని పేర్కొన్నారు.