KTR | హైదరాబాద్ (నమస్తే తెలంగాణ)/ మేడ్చల్, మంచిర్యాల, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశాన్ని ముంచి దేవుడి పేరుతో ఓట్లు అడిగేవారిని పట్టించుకోవద్దని బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేవాళ్లు.. చెప్పేది దేవుడు పేరు.. చేసేది అదానీకి సేవ’ అంటూ ఆరోపించారు.
గురువారం మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అల్వాల్లో జరిగిన యూత్ మీటింగ్లో, నిర్మల్, భైంసాల్లో జరిగిన రోడ్షోల్లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో పదేండ్లు పాలించిన బీజేపీకి.. ఏం చేసిందో చెప్పుకొనే దమ్ము లేదని విమర్శించారు. ‘నరేంద్ర మోదీ ఏందయ్యా నీ గోల అంటే.. నమో అంటారు. నమో అంటే నమ్మించి మోసం’ అని ఎద్దేవా చేశారు.
మోదీ రూ.14 లక్షల కోట్లు అదానీ, అంబానీలకు రుణమాఫీ చేశారని, తాను చెప్పిందిన అబద్ధమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరోసారి తేల్చిచెప్పారు. ఇక, మోదీతో కొట్లాడే ధైర్యం రాహుల్గాంధీకి లేదని అన్నారు. ప్రాంతీయ పార్టీలే మోదీగా బలంగా కొట్లాడుతాయని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ బీజేపోళ్లు ఆ ప్రభుత్వాలను అలవోకగా పడగొట్టారు.
కానీ కేసీఆర్, మమతాబెనర్జీ, హేమంత్ సోరెన్, స్టాలిన్, కేజ్రీవాల్ ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నం చేసి బీజేపీ విఫలమైంది’ అని వెల్లడించారు. బీజేపీతో బీఆర్ఎస్ ఎన్నడూ కలిసి పనిచేయలేదని, కలిసి ఉండి ఉంటే కవితను అరెస్టు చేసేవారా? అని ప్రశ్నించారు. అరచేతిలో వైకుంఠం చూపెట్టిన రేవంత్రెడ్డి.. ఐదు నెలల్లో రాష్ర్టాన్ని ఆగం చేశారని దుయ్యబట్టారు. ఆ మాటలు నమ్మితే మరోసారి మోసపోయి గోసపడాల్సి వస్తుందని ప్రజలకు సూచించారు.
ఆర్నెల్లలో కేసీఆర్ చుట్టే రాష్ట్ర రాజకీయాలు
కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది? ఇవాళ ఎట్లా ఉన్నది? అన్నది చూడాలని కేటీఆర్ ప్రజలను కోరారు. ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ ఓటేద్దామా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక గుడులు కట్టుడే కాదు.. ఆధునిక దేవాలయాలు కట్టారని తెలిపారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం సహా కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కటి నీళ్లు తెచ్చారని వెల్లడించారు.
‘కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ బాగుండే అనుకునేటోళ్లు మే 13న బీఆర్ఎస్కు 10-12 ఎంపీ సీట్లు అప్పజెప్పండి. ఆరు నెలల్లో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తది. రాష్ట్ర రాజకీయం మొత్తం కేసీఆర్ చుట్టే గింగిరాలు కొడుతది’ అని అన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, నందికంటి శ్రీధర్, బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కు తదితరులు పాల్గొన్నారు.
రాహుల్.. ఎందుకీ అబద్ధాలు?
తెలంగాణ ప్రజలతో డ్రామాలు ఆడుతున్నారా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. నెరవేర్చని వాగ్దానాలను నెరవేర్చినట్టు ఎలా చెప్తారని ప్రశ్నించారు. వేయని రైతుభరోసా వేసినట్టు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఎక్కడన్నా ఒక్క రైతుకైనా రూ.7,500 సాయం అందిందా? నాడు రూ.15 లక్షలు వేస్తానన్న బడాభాయ్ వేయలేదు.
నేడు రూ.15 వేలు ఇస్తానన్న చోటాభాయ్ ఇవ్వలేదు. రైతు భరోసా వేసినట్టు ఎందుకీ ఫోజులు..? అసత్యాలపై కాంగ్రెస్ స్వారీ ఇంకెన్ని రోజులు? డిసెంబర్ 9న చేస్తానన్న రెండు లక్షల రుణమాఫీ జాడేది? కౌలు రైతులు, కూలీలకు చేస్తామన్న సాయం సంగతేది? ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన? నమ్మి ఓటేసిన పాపానికి ఏంటీ నయవంచన? ఇది ప్రజాపాలన కాదు.. ముమ్మాటికీ ఇది ప్రజా వ్యతిరేక పాలన. 420 మోసపూరిత వాగ్దానాలతో నాలుగుకోట్ల ప్రజలను వంచించిన పాలన.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాచైతన్యం వెల్లివిరుస్తుంది. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక బీఆర్ఎస్వైపే ప్రజాతీర్పు ప్రతిధ్వనిస్తుంది’ పేర్కొన్నారు. మోదీ పేర్కొంటున్నట్టు అదానీ, అంబానీలు టెంపోల నిండా స్కాంగ్రెస్ (కాంగ్రెస్)కు డబ్బు పంపితే ఆయన (మోదీ) ఇష్టమైన మిత్రులు ఈడీ, ఐటీ, సీబీఐ ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు.
దీన్నిబట్టి నోట్లరద్దు విఫలమైందని మోదీ అంగీకరిస్తున్నారా? అని నిలదీశారు. తెలంగాణను అనేక రంగాల్లో నంబర్ 1గా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కిందని అన్నారు. ఇందుకు ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణంకాలే సాక్ష్యాలని పేర్కొన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ప్రగతిని చూపించే దమ్ముందా? అని సవాల్ చేశారు.
కేటీఆర్పై భైంసాలో రాళ్లదాడి
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గం భైంసాలో కేటీఆర్పై కొందరు నిరసనకారులు రాళ్లు, టమాటలు, ఉల్లిగడ్డలు, కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. రోడ్షో ప్రారంభించడానికి ముందే ప్లాన్ చేసి మరీ కొందరు నిరసనకు దిగారు. హనుమాన్ మాలధారులను రెచ్చగొట్టి ప్లకార్డులు ప్రదర్శించేలా చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కేటీఆర్.. ‘బ్రదర్ మీరు ఏమైనా లొల్లి చేసేది ఉంటే మీరు మీరు చేసుకోండి.
ఇక్కడ చిల్లర పంచాయితీలు చేయకండి. మీ ప్రచారం మీరు చేసుకోండి. మా ప్రచారం మేము చేసుకుంటాం’ అని చెప్పారు. ఆయన మాట వినకుండా దాడి చేశారు. అయినా కేటీఆర్ సహనం పాటించారు. దీంతో రోడ్షోకు వచ్చిన జనం జై తెలంగాణ అంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. దాడి అనంతరం కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
భైంసాలో తనపై జరిగిన దాడి విషయంలో అభిమానులు ఆందోళన చెందవద్దని అన్నారు. తనకేమైనా జరిగిందేమోనని అభిమానులు ఫోన్లు చేస్తున్నారని తెలిపిన ఆయన.. తన క్షేమ సమాచారాన్ని తెలిపారు. భైంసాలో బీజేపీ గూండాలు రాళ్లు విసిరారని వెల్లడించారు. విద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిపై, మతం పేరుతో విషం చిమ్మే వారిపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.