Telangana | హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా విద్వేషం పెరుగుతుంటే, మతసామరస్యంతో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కొనియాడారు. శుక్రవారం అసెంబ్లీలో జీవో అవర్లో ఆయన మాట్లాడుతూ మణిపూర్, హర్యానాలోని హింసాకాండను ప్రస్తావించారు. రాజస్థాన్లో రైల్వే ప్రొటెక్షన్ ఆఫీసర్ చేతిలో హత్యకు గురైన హైదరాబాదీ ఉదంతాన్ని వివరించారు. ఆ హింసాకాండను రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా చూడాలని, ఆ నమ్మకం సీఎం కేసీఆర్పై ఉన్నదని వెల్లడించారు.
రాజస్థాన్ ఘటనలో మృతిచెందిన సైఫుద్దీన్ కుటుంబీకులు రోడ్డున పడ్డారని, వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ వినతిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. దేశంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, మతచిచ్చు పెట్టి చలిమంటలు కాచుకోవడం దారుణమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలను తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. సైఫుద్దీన్ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సైఫుద్దీన్ భార్యకు ఉపాధి కల్పిస్తామని, డబుల్ బెడ్రూం ఇంటిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వారికి ముగ్గురు ఆడపిల్లలని, ఒక్కొక్కరి పేరిట రూ. 2 లక్షల చొప్పున బీఆర్ఎస్ తరపున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. వెంటనే బాధితుల వివరాలను అందజేయాలని అక్బరుద్దీన్ ఒవైసీని కోరారు. బాధితులను ఆదుకొనేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని, దేశానికి ఒక సందేశాన్నివ్వాలని పిలుపునిచ్చారు.
రెసిడెన్షియల్ స్కూల్స్ అద్భుతం
రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయని అక్బరుద్దీన్ ఒవైసీ కితాబు ఇచ్చారు. అసెంబ్లీలో విద్య, వైద్యంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ రెసిడెన్షియల్ స్కూల్స్ను ప్రభుత్వం బాగా నిర్వహిస్తున్నదని ప్రశంసించారు. మన ఊరు మన బడి మంచి కార్యక్రమం అని అభినందించారు. సీఎం కేసీఆర్ విద్యారంగం విషయంలో అద్భుతంగా పనిచేస్తున్నారని శ్లాఘించారు. వైద్య రంగంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తున్నదని కొనియాడారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయటం ప్రశంసనీయమని తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావును అభినందిస్తున్నామని వెల్లడించారు. ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని బాగా చేశారని, ఐఎంఆర్ రేటును బాగా తగ్గించారని తెలిపారు. డాక్టర్లు, నర్సులు పోస్టులను పెద్దఎత్తున భర్తీ చేశారని గుర్తుచేశారు. ఒక్కో ఎంబీబీఎస్ విద్యార్థిపై భారీగా ఖర్చు అవుతుందని, తమకు కూడా వైద్య కళాశాల ఉన్నదని, మెడికల్ కాలేజీ నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుందో తమకు తెలుసనని వెల్లడించారు.