హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): బెంగళూరులో ఐటీ పరిశ్రమ కేంద్రీకృతమైన సిలికాన్ వ్యాలీలో కనీస సదుపాయాలైన రోడ్లు, విద్యుత్తు, నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని ఖాతాబుక్ సీఈవో, హౌసింగ్.కామ్ సీవోవో రావిశ్ నరేశ్ అసహనం వ్యక్తంచేశారు. ‘బెంగళూరులోని హెచ్ఆర్ఎస్/కోరమంగళ (భారతదేశ సిలికాన్ వ్యాలీ)లో స్టార్టప్లు ఇప్పటికే బిలయన్ల డాలర్ల పన్నులు చెల్లిస్తున్నాయి. కానీ ఇప్పటికీ మాకు అధ్వాన్నమైన రోడ్లు, రోజువారీ విద్యుత్తు కోతలు, నాణ్యతలేని నీటి సరఫరా, దారుణమైన ఫుట్పాత్లే ఉన్నాయి. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు సిలికాన్ వ్యాలీ కంటే మెరుగైన మౌలిక సదుపాయాలున్నాయి. సమీపంలోని ఎయిర్పోర్ట్కు వెళ్లాలంటే ట్రాఫిక్లో మూడు గంటలకు పైగా సమయం పడుతుంది. దయచేసి మాకు సాయం చేయండి’ అని పీఎంవో ఇండియా, ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ4కర్ణాటక, బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను ట్యాగ్ చేస్తూ శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ ట్వీట్పై తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు.‘మీ బ్యాగులు సర్దుకొని హైదరాబాద్కు రండి! మా దగ్గర మెరుగైన భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. మా విమానాశ్రయం అత్యుత్తమైనది. నగరంలోకి రావడం, బయటికి వెళ్లడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మా ప్రభుత్వ దృష్టి త్రీ-ఐ మంత్ర (ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్)పై ఉన్నది’ అని ట్వీట్ చేశారు. కేటీఆర్ చెప్పింది నిజమేనంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. హైదరాబాద్లో మంచి వాతావరణంతో పాటు దేశంలోనే అత్యుత్తమ శాంతిభద్రతలు ఉన్నాయి. బెంగళూరు కంటే హైదరాబాద్ చాలా బెటర్.. కేటీఆర్ చెప్పింది 100 శాతం నిజం, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు మీరు చేస్తున్న కృషి అద్భుతం.. చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది కేటీఆర్ సార్’ అంటూ ట్వీట్లు చేశారు.