Minister KTR | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వర్షాలు తగ్గిముఖం పట్టినందున ప్రజలకు పునరావాస సహయక చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలని, భారీగా మెడికల్ క్యాంపులు పెట్టాలని, దీనిని సవాల్గా తీసుకోవాలని మున్సిపల్ అధికారులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ప్రధాన రహదారులపై పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించాలని సూచించారు. పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో శనివారం మంత్రి కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వారం పాటు భారీగా కురిసిన వర్షాలు తగ్గటంతో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పురపాలకశాఖ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరా, నీటిజనిత వ్యాధులు రాకుండా చేపట్టాల్సిన వైద్యారోగ్య చర్యలపై ప్రధానంగా చర్చించారు. సహాయ కార్యక్రమాల్లో ఇతర శాఖలతోనూ సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని, అధికారులు, సిబ్బందికి సెలవులను ఇప్పటికే రద్దు చేశామని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగకుండా చూడటమే అత్యంత ప్రాధాన్య అంశంగా గుర్తించాలని చెప్పారు. పట్టణాల్లో ఉన్న చెరువులు పూర్తిగా నిండాయని, వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, అవసరమైతే సాగునీటి శాఖతో మాట్లాడి మార్గదర్శకాల మేరకు వాటిని కొంత ఖాళీ చేయించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అవసరమైతే తరలించాలని ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎలాంటి అవసరం ఉన్నా స్వయంగా తన కార్యాలయంతో పాటు పురపాలక శాఖ ఉన్నతాధికారులు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు.
ప్రతి జిల్లాలో కంట్రోల్ రూం
సహాయక చర్యల సమన్వయం కోసం హైదరాబాద్తో పాటు ప్రతి జిల్లాలో కం ట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పట్టణాల్లో అవసరమున్న చోట రహదారుల తాతాలిక మరమ్మతులు చేయాలని తెలిపారు. ప్ర తి పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని చెప్పారు. అదనపు సిబ్బంది, వాహనాలు సమకూర్చుకోవాలని అన్నారు. బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైడ్, దోమల నివారణ మందుల పిచికారి కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత తాగునీరును అందించాలని ఆదేశించారు. ప్రజలు తాగునీటిని కాచి వడ పోసుకొని తాగేలా అవగాహన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సురక్షిత తాగునీరు సరఫరా కోసం మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకొని పైపులైన్ల లీకేజీలు వెంటనే మరమ్మతులు, తాగునీటి క్లోరినేషన్ వంటి కార్యక్రమాలను వేగంగా చేపట్టాలని వెల్లడించారు.
వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని, పట్టణాల్లో ఉన్న బస్తీ దవాఖానలు ప్రభుత్వ వైద్యారోగ్యశాఖ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి సంస్థల సహకారంతో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు. డీఎంహెచ్వోలతో సమన్వయం చేసుకొని అవసరమైన వైద్యారోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శిధిలావస్థలో ఉన్న పురాతన భవనాలను వెంటనే తొలగించాలని, విద్యుత్తు శాఖతో సమన్వయం చేసుకొని మరమత్తు కార్యక్రమాలను చేపట్టాలని వివరించారు. టెలికాన్ఫరెన్స్లో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సీడీఎంఏ సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.