పది లక్షల రూపాయలు ఇస్తే తరగతి గదికి పేరు పెడతాం
మన ఊరు-మన బడిలో ఎన్నారైలు పాలుపంచుకోవాలి
అన్ని రంగాల్లో తెలంగాణ రోల్ మోడల్
ఎన్నారైల వర్చువల్ సమావేశంలో మంత్రులు కేటీఆర్, సబిత
హైదరాబాద్, ఫిబ్రవరి 12 : పది లక్షల రూపాయల విరాళమిస్తే తరగతి గదికి, రూ. 25 లక్షల నుంచి కోటి వరకు విరాళమిస్తే పాఠశాలకు దాతల పేరు పెడతామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి, మనబస్తీ-మన బడి కార్యక్రమంలో ఎన్నారైలు పెద్దఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీనిని ప్రభుత్వ కార్యక్రమం మాదిరిగా కాకుండా ప్రజలను, ఎన్నారైలను, గ్రామస్థులను, పూర్వవిద్యార్థులను భాగస్వామ్యం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. శనివారం ప్రగతిభవన్ నుంచి వర్చువల్ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ఎన్నారైలకు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనం, నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తూ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని అన్నారు. విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ప్రాథమిక పాఠశాల నుంచి మహిళలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీల వరకు వందల విద్యాసంస్థలను నెలకొల్పామని, లక్షల మంది విద్యార్థులకు అత్యుత్తమ సౌకర్యాలతో విద్యను అందిస్తున్నామని, వాటి ఫలాలు అందుతున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. సర్కారు స్కూళ్లను సైతం అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మన ఊరు – మన బడి పథకాన్ని ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లి అభివృద్ధి చెందిన తెలంగాణ బిడ్డల భాగస్వామ్యాన్ని ఈ విషయంలో కోరుతున్నట్టు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముందుకొస్తే తరగతి గదులు, బడులకు దాతలు పేర్లు పెట్టేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించనున్నట్టు వెల్లడించారు. ప్రత్యేక వెబ్సైట్ రూపొందించిన తర్వాత డొనేషన్లు తీసుకోనున్నట్టు చెప్పారు.
సంపూర్ణ సహకారం అందిస్తాం: సబితా ఇంద్రారెడ్డి
ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి తోడ్పాటు అందించేందుకు విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు ముందుకురావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. తమ గ్రామాలు లేదా తాము ఎంచుకొనే ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందు, వాటి అభివృద్ధికి ముందుకొచ్చే ఎన్నారైలకు విద్యాశాఖ తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు.
విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చిన ఎన్నారైలు
మన ఊరు-మన బడి ఎంతో మంచి కార్యక్రమమని ఎన్నారై ప్రతినిధి జయ్శేఖర్ తాళ్లూరి మెచ్చుకున్నారు. తన వంతుగా రూ.25 లక్షల సాయం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎన్నారైలను భాగస్వాములను చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరం తనకు ఎంతో ఇచ్చిందని, తాను రూ.25 లక్షలు ఇవ్వనున్నట్టు నిమ్మగడ్డ కృష్ణ పేర్కొన్నారు. తన వంతుగా ప్రభుత్వ పాఠశాలకు నిధులు ఇస్తానని మోహన్ పటోళ్ల తెలిపారు. వీరితోపాటుగా మరికొందరు రవిచందర్, తడకమల్ల ప్రవీణ్, చేపూరి లక్ష్మి, సునీల్ సవేలీ, పరమేశ్ భీంరెడ్డి, చల్లా జయంత్, కవిత చల్లా విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. సమావేశంలో వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలతోపాటు టీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధి అనిల్ కూర్మాచలం, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.