తెలంగాణపై ప్రేమ ఉంటే ‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వాలి
పాదయాత్ర పేరిట బండి పచ్చి అబద్ధాలు
దమ్ముంటే సుష్మా మాటను నిలబెట్టండి
28 వేల కోట్లతో పాలమూరు ప్రాజెక్టులు
వాటికి కేంద్రం 28 పైసలు కూడా ఇవ్వలే
రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణకు అన్యాయం
కాంగ్రెస్ నేతకు పబ్బులు తప్ప ఎడ్లు..
వడ్లు తెలియవు: నారాయణపేటలో కేటీఆర్
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
మహబూబ్నగర్, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణపై ప్రేమ ఉంటే కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా.. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతానికి అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా ఇవ్వకపోయినా సిగ్గులేకుండా బీజేపీ నేతలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో రూ.82 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
అనంతరం పట్టణంలోని మినీ స్టేడియం లో ప్రభుత్వ కార్యక్రమాల ప్రగతిసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో అధికారిక లెక్కల ప్రకారం ఉమ్మడి ఏపీలో 811 టీఎంసీల కేటాయింపులుండేవని, రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లవుతున్నా నీటివాటాలు కేటాయించలేదని మండిపడ్డారు. నీటి వా టాలు తేల్చక ఆగమైన పాలమూరుతోపాటు నల్లగొం డ జిల్లాకు 575 టీఎంసీలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్వయంగా మోదీని అడిగిన విషయాన్ని గుర్తుచేశారు. అబద్ధాలతో పాలమూరు రైతాంగాన్ని మోసంచేసేందుకు బీజేపీ నేతలతోపాటు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.
పాదయాత్రల పేరిట పచ్చి అబద్ధాలు
పాలమూరు జిల్లాకు చేసిందేమీ లేకపోగా పాదయాత్రలు చేస్తూ కారుకూతలు, పచ్చి అబద్ధాలతో పాలమూరు రైతాంగాన్ని బీజేపీ నేతలు సిగ్గులేని మా టలు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. దమ్ముంటే, పలుకుబడి ఉంటే, మోదీకి చిత్తశుద్ధి ఉం టే.. తెలంగాణపై ప్రేమ ఉంటే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్చేశారు. సుష్మాస్వరాజ్ హైదరాబాద్లో సభ పెట్టి పాలమూరుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. కర్ణాటకలో అప్పర్ భద్రకు జాతీయ హో దా ఇస్తరు.. కానీ మేం అడిగితే వినబడనట్టు ముం దుకు పోతరని కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి అన్నారు. అమిత్ షాకు నీతి, నిజాయితీ ఉంటే తెలంగాణకు కృష్ణా జలాల్లో 511 టీఎంసీలు కేటాయించి, పాలమూరుకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోపాటు ఉమ్మడి జిల్లాలోని చెరువులను నింపడానికి రూ.28 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. దీంతో 8 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్లు వచ్చాయని తెలిపారు. ఈ 28 వేల కోట్లలో 28 పైసలైనా మోదీ ప్రభుత్వం ఇచ్చిందా? అని నిలదీశారు. వికారాబాద్ నుంచి నారాయణపేట మీదుగా కృష్ణాకు రైల్వే లైన్, గద్వాల నుంచి మాచర్ల దాకా రైల్వేలైన్ అడుగుతున్నా స్పందించలేదని చెప్పారు.
ఒక్క అక్షరం తప్పున్నా.. ఏ శిక్షకైనా సిద్ధం..
ఇందులో మా పైసలు.. అందులో మా పైసలు అం టూ బీజేపీ నేతలు బడాయికి పోతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కేంద్రం డబ్బులున్నాయని ఒకాయన పాదయాత్రలు చేస్తూ అడ్డం, పొడవు మాట్లాడుతున్నారన్నారు. ‘ఏ ఊరికి పోయినా చెట్లు, నల్లా కనెక్షన్లు కనపడుతున్నాయి. ఆసరా పెన్షన్లు అందుకుంటున్న అవ్వలు కనబడ్డారు.. రైతు వేదికలు, వైకుంఠధామాలు, డంప్ యార్డులు కనపడుతున్నా యి.. ఈ పథకాలన్నింటిలో మా పైసలున్నాయని ఆ యన అంటున్నాడు.
కేంద్రం పైసలే మన పథకాల్లో ఉంటే.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కూడా ఇలాంటి పథకాలు అమలు కావాలి కదా?’ అని ప్రశ్నించారు. పక్క నే ఉన్న కర్ణాటకలోని రాయచూర్కు పోదాం.. మీరు చెప్పే మాటల్లో నిజాయితీ ఉంటే.. మా పథకాలన్నీ అక్కడ చూపిస్తావా? ధైర్యముందా? అని సవాల్ చేశా రు. తాను చెప్పే దాంట్లో ఒక్కటంటే ఒక్క అక్షరం తప్పు ఉన్నా ఏ శిక్షకైనా సిద్ధమని తేల్చిచెప్పారు. గత ఏడు నెలల్లో పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూ.3,65,795 కోట్లు చెల్లిస్తే.. కేంద్రం కేవలం రూ.1.68 లక్షల కోట్లు తెలంగాణకు తిరిగి ఇచ్చిందన్నారు. వెనుకబడిన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహా ర్లో తెలంగాణ పైసలతో ప్రాజెక్టులు పడుతున్నారని తెలిపారు. గ్రూప్-1 పరీక్షలు ఉర్దూలో నిర్వహించొద్దని కొందరు వాదిస్తున్నారన్న కేటీఆర్.. రాజ్యాంగం ఉర్దూను అధికారభాషగా గుర్తించలేదా? యూపీఎస్సీ తోపాటు కేంద్రం నిర్వహించే పరీక్షల్లో ఉర్దూ లేదా? అక్కడ లేని బాధ ఇక్కడెందుకు వస్తుందని అడిగారు.
కులం, మతం పేరిట రాజకీయాలు: శ్రీనివాస్గౌడ్
బీజేపీ నేతలు కులం మతం పేరిట రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వారి కండ్లు మండుతున్నాయని విమర్శించారు. పాదయాత్ర పేరిట పాలమూరులో తిరుగుతున్న ప్రతిపక్ష నేతలు కనీసం 50 మంది వెంట లేకున్నా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికలంటేనే ఇలాంటి గుంపులు వచ్చి ప్రజలను అయోమయానికి గురి చేస్తుంటాయని తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు ఎస్ రాజేందర్రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, నరేందర్రెడ్డి, అబ్రహం, కృష్ణమోహన్రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్రెడ్డి, సురభి వాణీదేవి, కార్పొరేషన్ చైర్మన్లు వాల్యా నాయక్, అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి, సాయిచంద్, ఇంతియాజ్ ఇసాక్, జడ్పీ చైర్పర్సన్లు స్వర్ణ సుధాకర్రెడ్డి, వనజ, కలెక్టర్ దాసరి హరిచందన, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర విద్యాసంస్థలెక్కడ?
కొత్త జిల్లాలు ఏర్పాటయితే నవోదయ పాఠశాల పెట్టాలని అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నదని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్తగా 84 కొత్త నవోదయలు ఇస్తే మనకు ఇచ్చిందేమీ లేదన్నారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినా.. 16 ట్రిపుల్ ఐటీలు మంజూరు చేసినా మనకు మాత్రం గుండు సున్నా ఇచ్చారన్నా.. దీన్ని బట్టి తెలంగాణపై కేంద్రం వైఖరి ఏమిటో అర్థమవుతున్నదని తెలిపారు. మనం 24 గంటల కరెంట్ ఉచితంగా ఇవ్వడం వారికి నచ్చడం లేదని.. రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వొద్దని ఆదేశి స్తున్నారని తెలిపారు. రైతు మోటర్ వద్ద మీటర్ పెట్టాలని మోదీ విద్యుత్ చట్టం తీసుకొచ్చిండని పేర్కొన్నారు. మీటర్లు పెట్టకపోతే అప్పులు ఇవ్వబోమని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తాను బతికున్నంత కాలం నా రైతు మోటర్ వద్ద మీటర్ పెట్టే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని గుర్తుచేశారు. నేత కార్మికుల వద్దకు బీజేపీ నేతలు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. చేనేత మీద జీఎస్టీ పన్ను విధించిన ఏకైక ప్రధాని మోదీనే అన్నారు. నారాయణపేట, కొత్తకోట, గద్వాలకు ఒక్క చేనేత సమూహం మంజూరు చేయ లేదని స్పష్టం చేశారు.
ఆ నేతకు పబ్బులు తప్ప ఎడ్లు.. వడ్లు తెలియవు
ఓ జాతీయ పార్టీ నేతకు ఎడ్లు తెలియవు.. వడ్లు తెలియవు.. పబ్బులు మాత్రం తెలుసు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ను పరోక్షంగా మంత్రి కేటీఆర్ విమర్శించారు. 50 ఏండ్లు దేశాన్ని చేతిలో పడితే సర్వనాశనం చేశారన్నారు. సొంత నియోజకవర్గం అమేథీలో గెలవలేని నేత తెలంగాణలో వచ్చి గెలుస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడని దుయ్యబట్టారు. దళితబంధులో భాగంగా 60 మంది లబ్ధిదారులకు 60 యూనిట్లను పంపిణీచేశారు.