టాటాలు మాత్రమే కాదు.. తాతలనాటి కులవృత్తులు, బిర్లాలు మాత్రమే కాదు.. బోర్లా పడ్డ పరిశ్రమలను బాగుచేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన. ఇందులో భాగంగానే రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధి వైపు దృష్టి సారించాం. వ్యవసాయం- పరిశ్రమలు, పల్లెలు- పట్టణాలు, ఆహారశుద్ధి- ఐటీ రంగాల్లో సమ్మిళిత వృద్ధిని నమోదుచేస్తున్నాం.
–మండలిలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): కొత్త రాష్ట్రంలో ఎదురవుతున్న ప్రతి చాలెంజ్ను ఒక అవకాశంగా మలుచుకుంటూ వాటిని సాధిస్తూ వస్తున్నామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. దేశం గర్వించదగ్గ పథకాలను అమలు చేస్తున్నామని.. అన్ని రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకునే విధానాలను అవలంబిస్తున్నామని చెప్పారు. వ్యవసాయం- పరిశ్రమలు, పల్లెలు- పట్టణాలు, ఆహార శుద్ధి- ఐటీ రంగాల్లో సమ్మిళిత వృద్ధి నమోదు అవుతున్నదని పేర్కొన్నారు. శుక్రవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యుల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిచ్చారు. ఐటీ, పరిశ్రమల పురోగతిపై స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడుతూ.. లాక్డౌన్ సమయంలో దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఊరూరా ధాన్యం కొనుగోళ్లు చేశామని చెప్పారు. అయితే బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్న జూట్ మిల్లులు లాక్డౌన్ కారణంగా మూతపడటంతో గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఏర్పడిందని తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్ వచ్చే ఏడాది కల్లా రాష్ట్రంలో జూట్మిల్లులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని చెప్పారు. ఈ మేరకు రూ.887 కోట్లతో కామారెడ్డి, వరంగల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మూడు జూట్ మిల్లుల పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయని తెలిపారు. ఈ మిల్లులు తయారుచేసే గన్నీ బ్యాగులను పౌరసరఫరాలశాఖే కొంటుందన్నారు. ఇలా ‘విన్ విన్’ పద్ధతుల్లో ముందుకు పోతున్నామని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయరంగం దేశమే ఆశ్చర్యపోయేలా అభివృద్ధి సాధించిందని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో పంజాబ్ను దాటిపోయామని ఎఫ్సీఐ చెప్పిందని.. ఇది ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడే విషయమన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో రైతు ఆదాయం 6.95% పెరిగిందని చెప్పారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న సిరిసిల్లలో నేడు టక్ష టన్నుల వ్యవసాయ దిగుబడులు పెరిగాయని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో హరిత, శ్వేత, నీలి, గులాబీ విప్లవాలు వచ్చాయని తెలిపారు.
తారు, నీరు శత్రువులని, రోడ్లుపై నీరు నిలిచినచోట తారు కొట్టుకుపోతున్నదని కేటీఆర్ అన్నారు. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్సీజనల్ వర్షాలు కురుస్తున్నాయని, దీంతో రోడ్లు దెబ్బతింటున్నాయని చెప్పారు. హైదరాబాద్లో ఎస్సార్డీపీ కింద లింక్రోడ్లు, ఫ్ల్లై ఓవర్లు, అండర్పాస్లు నిర్మిస్తున్నామని తెలిపారు. కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని, మార్చి, ఏప్రిల్ వరకు బిల్లులు క్లియర్గా ఉన్నాయని చెప్పారు. కరోనాకాలంలో 4, 5 నెలలు వెయిట్ చేయడం పెద్ద సమస్య కాదన్నారు. ఓఆర్ఆర్పై ట్రాఫిక్ పెరిగిందని.. 10 ఇంటర్ చేంజ్ల వద్ద ట్రామాకేర్ పాయింట్లను నెలకొల్పామని తెలిపారు. ఈ ఇంటర్ చేంజ్ల వద్ద ఫ్యూయల్ స్టేషన్స్, ఫుడ్కోర్టుల ఏర్పాటుకు యోచిస్తున్నామన్నారు. ఫుడ్కోర్టుల్లో రిజర్వేషన్ల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు.
హైదరాబాద్లోని మణికొండలో డ్రైనేజీలో పడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ రజనీకాంత్ చనిపోవడం బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. రైలింగ్ ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఇంజినీర్లను సస్పెండ్ చేశామని తెలిపారు. కొంత నిర్లక్ష్యం ఉన్నదని.. మంత్రిగా తాను బాధ్యత తీసుకుంటానని చెప్పారు. బాధిత కుటుంబానికి 10 లక్షలు అందిస్తామని.. ఇప్పటికే రూ.5 లక్షలు ఇచ్చామని పేర్కొన్నారు. హైదరాబాద్ రెండు సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాన్ని తట్టుకోలేదని.. ప్రపంచ ఆర్థిక రాజధాని న్యూయార్క్ 15 రోజుల క్రితం కురిసిన కుంభవృష్టికి అస్తవ్యస్తమైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి విజ్ఞప్తి మేరకు రాయసముద్రం చెరువును సందర్శించి అక్కడ ఎస్టీపీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పరిశ్రమలను ఆకర్షించడంలో తెలంగాణ దేశాలతో పోటీపడే స్థాయికి ఎదిగిందని, ఇటీవల రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలే దీనికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాతలనాటి కులవృత్తులు, బోర్లాపడ్డ పరిశ్రమలు బాగుపడాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. పెట్టుబడులు, ఉపాధికి పెద్దపీట వేసే ఐటీ, పరిశ్రమల రంగంపై రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. నేడు ప్రపంచం డిజిటల్ విప్లవం అనే నాలుగవ పారిశ్రామిక విప్లవం ముంగిట ఉన్నదని.. అవకాశాలను అందిపుచ్చుకుంటే మనకు తిరుగుండదని వివరించారు. పురోగమిస్తున్న తెలంగాణకు కేంద్రప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. విభజన హామీలతోపాటు, నూతన ప్రతిపాదనలకు సహాయం అందించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో అసాధారణమైన ప్రగతి నమోదైందని సాక్షాత్తూ కేంద్రమంత్రులు, కేంద్రప్రభుత్వ నివేదికలు, గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. ఈఓడీబీ ర్యాంకింగ్స్లో రాష్ట్రం టాప్ స్థానాల్లో ఉన్నదని తెలిపారు. కొత్త ఐటీ పాలసీలో రాబోయే ఐదేండ్లలో 50 వేల ఉద్యోగాలు టైర్-2 సిటీస్లో కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నామని వెల్లడించారు.
గతంలో వలసల జిల్లాగాఉన్న పాలమూరుకు నేడు ఇతర రాష్ర్టాలనుంచి వలసవస్తున్న పరిస్థితి ఏర్పడడం సంతోషకరమని.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలవల్లే ఈ ప్రగతి సాధ్యమైందని కేటీఆర్ తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు మాత్రమే పోటీ కాదని.. ఇతర దేశాలతో కూడా పోటీ పడుతున్నామని తెలిపారు.