హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలో లోటుపాట్లు, పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉన్నదని ప్రముఖ పండితులు మృత్యుంజయశర్మ, ఫణీంద్రశర్మ పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ బద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం పంచాంగాన్ని ప్రముఖ పండితులు మృ త్యుంజయశర్మ, ఫణీంద్రశర్మ చదివి వినిపించారు. పరాభవ నామ సంవత్సరం అంటే ‘అవమానం’ అని అర్థం తీసుకుంటారని, కానీ ‘పరా’ అంటే అమ్మవారు అని, భవం అంటే పుట్టినరోజు, ఈశ్వరుడు అని అర్థమని పండితులు వివరించారు. భగవంతుడంటే భక్తి లేకుండా, అధర్మమైన మార్గాలు ఎంచుకునే వాళ్లకు పరాభవం తప్పదని హెచ్చరించారు.
ఈ ఏడాది ఉన్నత పదవుల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతుందని మృత్యుంజయ శర్మ, ఫణీంద్రశర్మ చెప్పారు. వాణిజ్య రంగంలో విదేశీ ఆంక్షలను భారతదేశం సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపారు. దేశంలో వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులు, దిగుమతులు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే, ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిపక్షం ఎదిగే పరిస్థితులు ఏర్పడుతాయని స్పష్టంచేశారు. ఈ ఏడాది విద్యా విధానంలో పెను మార్పులు వచ్చి, విద్యార్థులకు నష్టం కలిగించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమాల వినియోగంతో యువత పక్కదారి పట్టే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. విద్యార్థులు జాగ్రత్తగా చదవి అత్యున్నత స్థానాలకు చేరాలని సూచించారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. అంతర్జాతీయంగా విదేశీ శక్తుల కుట్రలను మన దేశ సైనికులు ధీటుగా ఎదుర్కొంటారని, ఇరుగుపొరుగు దేశాలతో కొన్ని ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉన్నదని వివరించారు.
వ్యవసాయం రంగంలో ఈ ఏడాది మంచి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, చెరువులు, జలాశయాలు నిండిపోతాయని పండితులు తెలిపారు. ధాన్యం, పత్తి, మక్క వంటి పంటలు బాగా పండే అవకాశం ఉన్నదని చెప్పారు. రైతుల ఆత్మహత్యలు తగ్గే సూచనలు ఉన్నాయని వివరించారు. పశుసంపద అభివృద్ధి గణనీయంగా ఉంటుందని వివరించారు. కూరగాయల ధరలు కొంత వరకు తగ్గవచ్చని తెలిపారు. బంగారం, వెండి, ఆహార ధాన్యాల ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని తెలిపారు. రైలు, రోడ్డు, విమాన, అగ్ని ప్రమాదాలు ఈ ఏడాది అధికంగా ఉంటాయని, దొంగతనాలు సైతం పెరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. భారత దేశ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని, వాణిజ్య రంగంలో దేశం రాణిస్తుందని పేర్కొన్నారు. కొంతమంది సినీ, రాజకీయ ప్రముఖులు కనుమరుగు అయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు.
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని, మానవతా విలువలు పెరుగుతాయని పేర్కొన్నారు. విడాకుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గంగుల కమలాకర్, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ, మాజీ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్సీలు తాతా మధు, డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్, వాణీదేవి, పార్టీ సీనియర్ నాయకులు గ్యాదరి బాలమల్లు, దేవీప్రసాద్, వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్ చిరుమళ్ల రాకేశ్, గెల్లు శ్రీనివాస్యాదవ్, కిశోర్గౌడ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కొన్ని ప్రాంతాల్లో తుఫాన్లు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉన్నప్పటికీ, పాలకులు వాటిని సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉన్నదని పండితులు వివరించారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రకృతి ప్రకోపాలు ఉండే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు మానసికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు ఉండవచ్చన్నారు. ఈ ఏడాది సూర్య గ్రహణం, చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంపై పెద్దగా ఉండదని చెప్పారు. అనంతరం పార్టీ నాయకులు ఉగాది పచ్చడిని సేవించారు. వేద పండితులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆశీర్వచనాలు అందించారు. పార్టీ నాయకులు కేటీఆర్కు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.