హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడిన ఇరువురు నాయకులు ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అడిగారు. దీంతో మీ లాగానే తమకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతున్నదని రాజగోపాల్ రెడ్డి సమాధానం ఇచ్చారు. కుటుంబ పాలన కాదు.. మంచిగా పని చేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ కౌంటర్ వేశారు.
ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా, మీ అబ్బాయి సంకీర్త్ పోటీ చేస్తున్నారా అని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అడిగారు. తన భార్య లక్ష్మీ పోటీ చేస్తుందని సరదాగా సమాధానం ఇచ్చారు. దయచేసి తనను వివాదాల్లోకి లాగొద్దని రాజగోపాల్ రెడ్డి అనడంతో.. తర్వాత మాట్లాడదాం అంటూ కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, వీరిద్దరి సంభాషణను అక్కడ ఉన్న నాయకులు ఆసక్తిగా విన్నారు.