హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ)/పోచమ్మమైదాన్: ప్రముఖ పారిశ్రామికవేత్త, వరల్డ్ పద్మశాలి క్లబ్, మోక్షారామం ఫౌండేషన్, రాష్ట్ర పద్మశాలి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామా శ్రీనివాస్ (59) మంగళవారం ఆకస్మికంగా మృతి చెందారు. వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన శ్రీనివాస్ హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నుమూశారు.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, లక్ష్మారెడ్డి, జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్రావు తదితర ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మోక్షారామం ఫౌండేషన్ ద్వారా శ్రీనివాస్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని కేటీఆర్, హరీశ్రావు స్మరించుకున్నారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. రామా శ్రీనివాస్ అంత్యక్రియలు బుధవారం ఉదయం 11 గంటలకు రామన్నపేటలోని శ్మశాన వాటికలో జరుగనున్నాయి.
ఆయన సేవలు అమోఘం
తల్లిదండ్రులు రామా ఆగయ్య, ఉప్పలక్ష్మి కోరిక మేరకు రామన్నపేటలో మోక్షారామం ఫౌండేషన్ ఏర్పాటుచేసి అనేక సేవ కార్యక్రమాలు చేపట్టారు. 50 లక్షలతో శ్మశానవాటికను నిర్మించారు. పేదలు, అనాథశవాలకు అయ్యే అంత్యక్రియల ఖర్చు భరించేవారు. ఫౌండేషన్ ద్వారా నిత్య అన్నదానం చేస్తున్నారు. బిడ్దల వివాహాలు చేసే ఆర్థిక స్థోమత లేనివారికి ఇప్పటివరకు 250 మందికి మంగళసూత్రాలు, వస్ర్తాలు, నగదు సహాయం చేశారు.