హైదరాబాద్, డిసెంబర్1 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది యాసంగి సాగుకు నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి మొత్తం 130 టీఎంసీల నీరు అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి ఇండెంట్ సమర్పించింది. సాగర్ ఎడమకాలువకు 70 టీఎంసీలు, ఏఎంమ్మార్పీ నుంచి 35 టీఎంసీలు, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసం 5 టీఎంసీలు, శ్రీశైలం ఔట్లెట్ నుంచి 25 టీఎంసీల నీరు విడుదల చేయాలని ప్రతిపాదనలిచ్చింది.
ఏపీ కూడా సాగర్ కుడికాలువకు 67 టీఎంసీలు, కుడికాలువ నుంచి 8 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ నుంచి 22 టీఎంసీలు, హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి 8 టీఎంసీలు విడుదల చేయాలని ప్రతిపాదనలు పెట్టింది. ఈ నెల 6న నిర్వహించనున్న కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో ఇరు రాష్ర్టాల నీటి ఇండెంట్లపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు.