హైదరాబాద్ : రాజోళిబండ డైవర్షన్ స్కీం చుట్టూ నెలకొన్న వివాదాలకు ముగింపు పలకాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే బోర్డు నేతృత్వంలోని టెక్నికల్ టీం ఆర్డీఎస్ ఆనికట్, సుంకేసుల బరాజ్, తుమ్మిళ్ల లిఫ్ట్ స్కీంతో పాటు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆర్డీఎస్ కుడికాలువల పనులను పరిశీలించింది. రాజోలి బండ డైవర్షన్ స్కీంతో ముడిపడి ఉన్న అంశాలపై చర్చించేందుకు ఈనెల 9న జలసౌధలో కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో పాల్గొనాలని తెలంగాణ, ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీలు, కర్నాటక నీరవరి నిగమా లిమిటెడ్ ఎండీ, తుంగభద్ర బోర్డు చైర్మన్లకు కేఆర్ఎంబీ ఈఈ శివశంకరయ్య ఇటీవల లేఖ రాశారు.
జనవరి 28న కేఆర్ఎంబీ కమిటీ పరిశీలించి బోర్డుకు ఇచ్చిన ఫీల్డ్ అబ్జర్వేషన్ వివరాల కాపీలోని అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ఆర్డీఎస్లో తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులు ఉండగా, ఇంతవరకు 5 టీఎంసీలకు మించి వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలో సుంకేసుల ఫోర్షోర్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టారు. ఈ లిఫ్ట్ స్కీం అక్రమమని ఏపీ ఫిర్యాదు చేసింది. ఆర్డీఎస్ నీళ్లు తెలంగాణకే సరిపోవడం లేదని, ఏపీ కేటాయింపులకు రెట్టింపు నీటిని తీసుకుంటూ కొత్తగా కుడి కాలువ తవ్వకానికి పూనుకుందని తెలంగాణ ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ సంబంధిత ప్రాజెక్టులను పరిశీలించిన టెక్నికల్ కమిటీ ఆర్డీఎస్కు ఎగువన, ఆర్డీఎస్ నుంచి తెలంగాణ నీళ్లు తీసుకునే ఔట్ లెట్ వద్ద, సుంకేసుల దిగువన, తుమ్మిళ్ల దిగువన టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని బోర్డు ప్రతిపాదించింది. తుది అనుమతులు వచ్చే వరకు తుమ్మిళ్ల ఎత్తిపోతలతో పాటు ఆర్డీఎస్ కుడి కాలువ పనులు నిలిపివేయాలని సూచించింది. కర్నాటక భూభాగంలోని ఆర్డీఎస్ కాలువ ఆధునీకరణ, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మూడు రాష్ట్రాలు చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారిని ఈ సమావేశానికి పంపాలని బోర్డు ఈఈ లేఖలో సూచించింది.