హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి జలాశయాల నుంచి ఏపీ సర్కారు ఇంకా మూడు టీఎంసీలను వినియోగించుకొనే అవకాశమున్నదని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) స్పష్టం చేసింది. ఉమ్మడి జలాశయాల నుంచి ఏపీ అక్రమంగా జలాలను మళ్లిస్తున్నదని, నిలువరించాలని తెలంగాణ సర్కారు గతంలో బోర్డుకు లేఖను రాసింది. దానిపై బోర్డు తాజాగా స్పందించింది. గత అక్టోబర్లో నిర్వహించిన త్రిసభ్య కమిటీ నిర్ణయించిన 45 టీఎంసీల్లో ఏపీ ఇప్పటివరకు 41.95 టీఎంసీలను వినియోగించుకున్నదని, ఇంకా 3.046 టీఎంసీలను ఉమ్మడి జలాశయాల నుంచి వినియోగించుకొనే అవకాశమున్నదని బోర్డు వెల్లడించింది.
తెలంగాణనే 35 టీఎంసీల కోటాకు మించి 4.74 టీఎంసీలను బోర్డు ఉత్తర్వులు లేకుండానే వాడుకున్నదని ఆక్షేపించింది. అదనపు నీళ్లు కావాలంటే ఇండెంట్లను పంపించిన తర్వాత త్రిసభ్య కమిటీ సమావేశంలోనే తీర్మానించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తెలంగాణ తమ దృష్టికి తీసుకొచ్చిన క్యారీఓవర్ స్టోరేజీ అంశాన్ని ట్రిబ్యునల్కు అప్పగించామని తెలిపింది. ఇక తాగునీటి వినియోగంలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై బోర్డు సమావేశంలో ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నది.